హైదరాబాద్ : నూతన సచివాలయం నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. అయితే సచివాలయంలో మందిరం, చర్చి, మసీదు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సచివాలయంలో చర్చి నిర్మాణానికి మెదక్ బిషప్ ఏసీ సాలమన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బిషప్ సాలమన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, చర్చి పనులు ప్రారంభించారు. 500 గజాల విస్తీర్ణంలో రూ. 1.5 కోట్లతో చర్చి నిర్మించనున్నారు.
ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. సచివాలయం ముందు భాగంలోని ఎలివేషన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అనుకున్న సమయానికి సచివాలయం పనులు పూర్తి చేయాలని అధికారులు, ఇంజినీర్లను సీఎం సూచించిన విషయం విదితమే.