అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చెలాయించడం పాత నాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీలో అసంతృప్తి జ్వాల లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వలస వచ్చిన నేతల తీరుపై పాత నాయకత్వం పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తోంది. కష్టాలు, నష్టాలను భరించి పార్టీని నమ్ముకుని ఉన్న నేతలను కాదని, ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంపై అడుగడుగునా ఆటంకాలు తలెత్తుతున్నాయి. పీసీసీ ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ బహిరంగంగానే గొడవలకు దిగుతున్నారు. తాజాగా(ఏప్రిల్ 27న) చందూర్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ అంబర్ సింగ్ మధ్య జరిగిన ఘర్షణ ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇతర పార్టీలకు వెళ్లకుండా పని చేస్తున్న జడ్పీటీసీ అంబర్ సింగ్ను ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయన అనుచరులు నోటికొచ్చినట్లు మాట్లాడడం తీవ్ర దుమారం రేపుతున్నది. గిరిజన జడ్పీటీసీ కావడంతోపాటు పార్టీలో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన నాయకుడిని అగౌరవపర్చడంపై వివాదం చెలరేగుతోంది. నిన్నగాక మొన్న కాంగ్రెస్లో చేరిన వారే పెత్తనం చెలాయించడాన్ని పాత నేతలంతా జీర్ణించుకోలేక పోతున్నారు. తమకు కనీస మర్యాద ఇవ్వకపోవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. గిరిజన నాయకుడికి అండగా నిలబడకపోగా ఈ వ్యవహారంపై పీసీసీ పెద్దలు స్పందించకపోవడంతో హస్తం శ్రేణులు రగిలి పోతున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మాజీ మహిళా ప్రజాప్రతినిధి ఆకస్మాత్తుగా పోటీ నుంచి తప్పుకున్నారు. తర్వాత తన అవకాశవాద రాజకీయం కోసం పార్టీ మారారు. 2023లో బీఆర్ఎస్లో చోటు లేకపోవడం, సీటు దక్కకపోవడంతో అప్పటి వరకు విధేయతను ప్రదర్శించినట్లు నటించిన సదరు నాయకుడు ఏకంగా గంటల వ్యవధిలోనే కండువా మార్చేశారు. ఇప్పుడు హస్తం అధికారంలో ఉండడంతో మాజీ ఎమ్మెల్యే తీరుపై పాత నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కష్ట కాలంలో పార్టీని వదిలి వెళ్లి, అవకాశాల కోసం కాంగ్రెస్లోకి వచ్చిన సదరు నేత చేస్తున్న హడావుడిని తట్టుకోలేక పోతున్నారు. ఎమ్మెల్సీ లేదంటే కార్పొరేషన్ పదవిని ఆశిస్తూ పీసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం కావడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో తమకు దక్కాల్సిన అవకాశాలు రాకుండా పోతాయా? అనే భయంలో పాత వారు కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ హయాం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగిన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నీడను వెతుక్కునే మరో లీడర్ రాకను కొందరు మైనార్టీ లీడర్లు ఎండగడుతున్నారు. కాంగ్రెస్ను కాదని వెళ్లిన మాజీ ఎమ్మెల్సీని తిరిగి చేర్చుకోవడం ఏంటంటూ శ్రమకోర్చిన నేతలంతా ఇప్పుడు గుస్సా అవుతున్నారు. బోధన్, బాన్సువాడ, నిజామాబాద్ రూరల్లో కొనసాగుతున్న చేరికలపై సొంత పార్టీలోనే నిరసనలు వెలుగు చూస్తున్నాయి.
కామారెడ్డిలోనూ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలో కొత్తగా వచ్చిన వారికే ప్రాధాన్యం దక్కడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హడావుడి చేష్టలు, ప్రచార కార్యక్రమాల్లో డబ్బులు వెచ్చిస్తూ హల్చల్ చేస్తున్న అవకాశవాదులను పీసీసీ నేతలు గుర్తించి దూరం పెట్టి, కష్టపడ్డ వారికే ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్లు పీసీసీని ఇరుకున పెడుతున్నాయి. లేదంటే తిరుగుబాటు తప్పదంటూ హెచ్చరికలు సైతం సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్లో కరుడుగట్టిన కార్యకర్తల్లా నటించి ముఖ్యులను నమ్మించి మోసం చేశారు. ఇప్పుడేకంగా కాంగ్రెస్ గూటికి చేరి అదే స్థాయిలో నటిస్తుండడంతో హస్తంలోని పాత నాయకత్వం ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నది. ఒకరిద్దరైతే కాంగ్రెస్ చేరి నెల రోజులు కాక ముందే అధికార పార్టీ అండతో వెంచర్లు, వేరే దందాలకు ముహూర్తాలను ఫిక్స్ చేయడం గమనార్హం. రాజకీయ పార్టీల్లో మారుతున్న ఈ దుర్వ్యవస్థను అన్ని రాజకీయ పార్టీలు సునిశితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వారికి చెక్ పెట్టే దిశగా ఆలోచన చేయాలని సామాన్య కార్యకర్తలంతా కోరుతున్నారు. శ్రమ పడిన వారికే అవకాశాలు ఇవ్వాలంటున్నారు. స్వార్థం కోసం కండువాలు మార్చే వారిని నమ్మొద్దంటూ హితవు పలుకుతున్నారు.
కొంతమంది నాయకులైతే ఫక్తూ వ్యాపారులుగా ముద్రపడి ఉన్నారు. వీరి దందాలో అక్రమ భాగమే ఎక్కువ. వీరికి రాజకీయ అండదండలుంటే తమ వ్యాపా రం మూడు పువ్వులు… ఆరు కాయలు అ న్న చందంగా వెలుగొందుతున్నది. అలాంటి వారంతా ప్రభుత్వా లు మారిన వెంటనే కండువా రంగులు మారుస్తున్నారు. తమ వ్యాపార వ్యాపకాన్ని మార్చకుండా రెండింతలు పెద్దది గా చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో ఈ మ ధ్యే హైదరాబాద్లో కొద్ది మంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హస్తం గూటికి చేరారు. ఇందులో రియల్ ఎస్టేట్, మద్యం, మెడికల్, ఫైనాన్స్, ఇతర వ్యాపారాల్లో పైచేయి సాధించిన వారే ఉండడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. పాత కాంగ్రెస్ ముద్రతో తిరిగి హస్తం గూటికి చేరుతున్న నాయకత్వమంతా పదేండ్లుగా ఇతర పార్టీల్లో అధికారాన్ని చెలాయించి ఇప్పుడు మరోసారి అదే దర్పాన్ని ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతున్నది. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మొదట బీఆర్ఎస్లోఎమ్మెల్యేగా ఉన్నారు. రెండో దఫా ప్రభుత్వంలో ఓటమి చెంది ఆ తర్వాత బీజేపీలో చేరారు. 2023 ఎన్నికల ముందర కాంగ్రెస్కు వచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని వదిలి బాన్సువాడకు రావడంతోనే గొడవలు మొదలయ్యాయి. అప్పటివరకు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కాసుల బాలరాజును కాదని ఏనుగుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ఆగ్రహం వ్యక్తంచేశారు. తీరా బాలరాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి దవాఖాన పాలయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే దూకుడు, ఇతర పార్టీల వారిని బలవంతంగా బెదిరించి, పిలిచి కండువాలు కప్పుతుండడంతో పాత నాయకులంతా మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండా ఇష్టారీతిన చేరికలను ప్రోత్సహించడంపై నిలదీస్తున్నారు. చందూర్లో జడ్పీటీసీ అంబర్ సింగ్ ఐదేండ్లుగా ఒకే ఒక్కడుగా జడ్పీలో కాంగ్రెస్ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. హస్తం పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయనను కూడా మాజీ ఎమ్మెల్యే కిరికిరి పెట్టడంతో శనివారం జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఎవడ్రా… ఏనుగు రవీందర్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో అంబర్ సింగ్ పోస్టులు పెట్టే స్థాయికి పరిస్థితి చేరింది. ఇలా పాత, కొత్త నాయకుల మధ్య పెడచూపుతున్న వివాదాలు చినికి చినికి గాలి వానలా మారుతున్నాయి.