బషీరాబాద్ / బోథ్/తిమ్మాపూర్/ మియాపూర్/కాచిగూడ,మే 1: వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్లోనే కుప్పకూలింది. స్థానికులు జిల్లా దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పరుపుల పల్లెకు చెందిన ఆత్రం జంగు(46) ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చి కిందపడి మృతిచెందాడు.
హైదరాబాద్లోని మియాపూర్లోని మీసేవ సమీపంలోని ఫుట్పాత్పై గుర్తు తెలియని వ్యక్తి (45), కాచిగూడ రైల్వేస్టేషన్ పార్కింగ్ ఫుట్పాత్పై గుర్తుతెలియని వృద్ధురాలు(65) వడదెబ్బతో బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కార్మిక దినోత్సవం నాడే ఓ ఆటో డ్రైవర్ ఆర్ నర్సయ్య(46) వడదెబ్బబారిన పడి కన్నుమూశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్లో బుధవారం జరిగింది.