Harish Rao | హైదరాబాద్ : సన్న వడ్ల బోనస్ కూడా బోగస్ అయింది.. సన్న వడ్ల బోనస్పై సన్నాయి నొక్కులేనా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా రూ. 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గం అని మండిపడ్డారు.
4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదు. రాష్ట్రంలో పొద్దు తిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. సన్ ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతున్నది. ఒక సిద్దిపేట జిల్లాలోనే 50 శాతం రైతులకు డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికిన మంత్రి గారు. రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయం. వెంటనే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 1,116 కోట్ల సన్నాల బోనస్ డబ్బులతో పాటు సన్ ఫ్లవర్ రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
రైతులను గోస పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రతీచోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన మీరు, పాలన కూడా అదే అబద్ధాలతో నడిపిస్తున్నారు. అడుగడుగునా ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం బయటపడుతోంది. రుణమాఫీ 50 శాతం రైతులకి కూడా అందలేదు. పోయిన వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారు. యాసంగిలో రైతు భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు 15 వేల రైతు భరోసా అని చెప్పి మాట తప్పి 12,000కి పరిమితం చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. రైతు కూలీల పరిస్థితి అయితే అధోగతే. ఎన్నికల హామీల్లో అన్ని పంటలకు బోనస్ అని చెప్పి రైతులను మభ్యపెట్టి ఇప్పుడేమో సన్నాలకి పరిమితం చేసి ఆ సన్నాలకు కూడా ఎగనామం పెట్టారు అని హరీశ్రావు నిప్పులు చెరిగారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా, యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బోనస్ చెల్లించకపోవడం రైతులను వంచించడమే. ఎంతో కష్టపడి పంట పండించినా, అది ప్రభుత్వ కొనుగోళ్లు లేక దళారుల పాలవుతోంది. కొనుగోలు చేసిన పంటలకు డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రైతులను మరింత దయనీయ స్థితికి నెడుతున్నది. యాసంగిలో బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే తప్ప కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాని దుస్థితి. ఈ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని హరీశ్రావు మండిపడ్డారు.
పంట పెట్టుబడి సహాయం అందించడంలో వైఫల్యం. పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం. ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం. కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రాష్ట్రంలో కొనుగోలు చేసిన సన్ ఫ్లవర్ పంటకు డబ్బులు విడుదల చేయాలని, అదేవిధంగా సన్నాలకు బోనస్ డబ్బులు కూడా విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు.