Congress | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించే మాట్లాడే నైతిక అర్హతే ఆ పార్టీకి లేదు. జాతీయ రాజకీయాల్లో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ.. ఇలా నాలుగైదు తరాలుగా కాంగ్రెస్ పార్టీపై ఈ కుటుంబ ప్రభావం, ఆధిపత్యం కొనసాగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోనూ అదే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ చిరకాలంగా వారసత్వ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. అనేక కుటుంబాలు ఆ పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా కాంగ్రెస్లోని ఇతర నేతలను ఎదగనివ్వకుండా పార్టీపై వీళ్లే పెత్తం చెలాయిస్తున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. కొన్ని కుటుంబాల చేతుల్లో కాంగ్రెస్ బందీ అయిందని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్రెడ్డి: కొడంగల్ నియోజకవర్గంలో చురుకైన నాయకులుగా కొనసాగుతున్న పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సోదరులు కొండల్రెడ్డి, తిరుపతిరెడ్డి ఏకంగా షాడో ముఖ్యమంత్రుల్లా వ్యవహరిస్తున్నారు. పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకోవడంతోపాటు పార్టీలో, ప్రభుత్వంలో తాము చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి, కొడంగల్లో కీలకపాత్ర పోషించిన ఈ ఇద్దరు రేవంత్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోతున్నారు.
మల్లు భట్టి విక్రమార్క: ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురానికి చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సొంత అన్న మల్లు రవి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యారు. ప్రస్తుతం నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన రెండుసార్లు నాగర్కర్నూల్ ఎంపీగా, మరోసారి జడ్చర్ల ఎమ్మెల్యే పనిచేయగా.. ఆయన అన్న మల్లు అనంతరాములు రెండుసార్లు ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు భట్టివిక్రమార్క సతీమణి నందిని ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ఇటీవల భారీ ర్యాలీలు నిర్వహించారు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి: పాలేరు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి ఇప్పుడు ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. పొంగులేటి తమ్ముడు ప్రసాద్రెడ్డి కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఖమ్మం లోక్సభ సీటును ప్రసాద్రెడ్డి కూడా ఆశించారు. తమ్ముడి కన్నా వియ్యంకుడైతేనే మంచిదని భావించిన పొంగులేటి చివరకి రఘురాంరెడ్డికే టికెట్ ఇప్పించుకున్నారు. వాస్తవానికి రఘురాంరెడ్డి కుటుంబానికి కూడా సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్నది. ఆయన తండ్రి రామసహాయం సురేందర్రెడ్డి కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా గెలిచారు.
జానారెడ్డి: కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి గతంలో రాష్ట్ర మంత్రిగా, పార్టీలో కీలక నేతగా పనిచేశారు. ఆయన కుమారుడు జయవీర్రెడ్డి ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరో కుమారుడు నల్లగొండ లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్: నల్లగొండ జిల్లాలోని మరో రాజకీయ కుటుంబం కోమటిరెడ్డి కుటుంబం. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండగా.. ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డి అసెంబ్లీలో మునుగోడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో సోదరుడు మోహన్రెడ్డి, ఆయన కుమారుడు పవన్ కూడా నల్లగొండ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. రాజగోపాల్రెడ్డి భార్య లక్ష్మి ఇటీవల భువనగిరి ఎంపీ టికెక్ను ఆశించారు.
ఉత్తమ్ కుమార్రెడ్డి: నల్లగొండ జిల్లాలోని మరో కాంగ్రెస్ కుటుంబం ఉత్తమ్ కుమార్రెడ్డి కుటుంబం. ప్రస్తుతం ఉత్తమ్ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుండగా.. ఆయన భార్య పద్మావతి కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నారు.
కడియం శ్రీహరి: మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీచేస్తున్నారు.
మామిడాల యశస్విని: పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని అత్త ఝాన్సీ కాంగ్రెస్లో కీలక నాయకురాలు. పౌరసత్వ వివాదం నేపథ్యంలో ఝాన్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గంలో ఆమె పెత్తనమే నడుస్తున్నది.
గడ్డం వినోద్, వివేక్: పెద్దపల్లి ఎంపీగా పోటీచేస్తున్న గడ్డం వంశీకృష్ణ తాత గడ్డం వెంకటస్వామి (కాకా) కేంద్ర మంత్రిగా పనిచేయడంతోపాటు పెద్దపల్లి నుంచి అనేకసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిగా రికార్డు ఉన్నది. ఆయన కొడుకు గడ్డం వినోద్ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మరో కొడుకు గడ్డం వివేక్ పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్, చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ కొనసాగుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వివేక్ కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. దీంతో కాకా కుటుంబం మూడు తరాల నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్టయింది.
షెట్కార్ కుటుంబం: జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సురేశ్ షెట్కార్ కుటుంబం చెప్పిందే కాంగ్రెస్ మాట. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన ఇప్పుడు మళ్లీ లోక్సభకు పోటీ చేస్తున్నారు. గతంలో సురేశ్ షెట్కార్ తాత అప్పారావు షెట్కార్, తండ్రి శివరావు షెట్కార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పనిచేశారు.
వెలిచాల రాజేందర్రావు: కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత వెలిచాల జగపతిరావు కుమారుడు వెలిచాల రాజేందర్రావుకు ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చారు. జగపతిరావు గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు.
శ్రీధర్బాబు: ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసిన దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు కుమారుడు దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతుంటే.. ఆయన తమ్ముడు శీనుబాబు స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
పట్నం మహేందర్రెడ్డి: మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి కుటుంబం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజ్యమేలుతున్నది. వికారాబాద్ జడ్పీ చైర్మన్గా పనిచేస్తున్న ఆయన భార్య సునీత.. తాజాగా కాంగ్రెస్ టికెట్పై మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. మహేందర్రెడ్డి సోదరుడి కుమారుడు పట్నం అవినాశ్రెడ్డి జడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతుండగా.. మహేందర్రెడ్డి సోదరుడు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
మైనంపల్లి హన్మంతరావు: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన హన్మంతరావు ఓటమిపాలవగా.. రోహిత్ మెదక్లో గెలిచిన విషయం తెలిసిందే.
అసెంబీల్లో ఎన్నికల్లో అదే తంతు: నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాజకీయ కుటుంబాలకే కాంగ్రెస్ పెద్దపీట వేసింది. మాజీ ఎంపీ రాజేశ్వర్రావు మనుమడు వొడితెల ప్రణవ్బాబుకు హుజూరాబాద్, మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డికి ఖైరతాబాద్, మాజీ మంత్రి చిట్టెం నర్సిరెడ్డి సమీప బంధువు చిట్టెం పర్ణికాకరెడ్డికి నారాయణపేట, మాజీ మంత్రి రత్నాకర్రావు తనయుడు జువ్వాడి నర్సింగరావుకు కోరుట్ల, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్రెడ్డికి నాగర్కర్నూల్ టికెట్లు ఇచ్చింది.
నారాయణఖేడ్లో పట్లోళ్ల కిష్టారెడ్డి కుమారుడు పట్లోళ్ల సంజీవరెడ్డి, అందోల్లో దివంగత మాజీ ఎమ్మెల్యే సీ రాజనర్సింహ తనయుడు దామోదర రాజనర్సింహా, దుబ్బాకలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్రెడ్డి వారసులుగా పోటీచేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా భార్య కోట నీలిమను సనత్నగర్లో నిలిపింది. కాంగ్రెస్లో చేరుతానని ఇటీవల ప్రకటించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు కుటుంబం మొత్తం రాజకీయాల్లోనే ఉన్నది. ఆయన కుమార్తె విజయలక్ష్మి బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి మేయర్ అయిన తర్వాత కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. కేకే కుమారుడు విప్లవ్కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ కుమారుడు సంజయ్ గతంలో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ మేయర్గా పనిచేయగా.. మరో కుమారుడు అర్వింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. తండ్రి, సోదరుడు కాంగ్రెస్లో ఉంటే.. అరవింద్ మాత్రం బీజేపీ పంచన చేరారు.
శాసనమండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్రెడ్డిది కాంగ్రెస్లోని అతిపెద్ద రాజకీయ కుటుంబాల్లో ఒకటి. గతంలో ఆయన మేనమామ ఎస్ జైపాల్రెడ్డి కేంద్ర మంత్రిగా, చిన్నమ్మ కుమారుడు (తమ్ముడు) మలిపెద్ది సుధీర్రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సీఎం రేవంత్రెడ్డి కూడా సుఖేందర్రెడ్డికి చుట్టమే. జైపాల్రెడ్డికి సుఖేందర్రెడ్డి మేనల్లుడైతే, రేవంత్ సతీమణి జైపాల్రెడ్డి సోదరుడి కుమార్తె. ఇప్పుడు సుఖేందర్రెడ్డి కుమారుడు అమిత్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన భువనగిరి ఎంపీగా పోటేచేసేందుకు బీఆర్ఎస్ టికెట్ను ఆశించిన విషయం తెలిసిందే.