KTR | రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయకుండా, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం అనంతరం.. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని.. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
క్వింటాలుకు మూడు, మూడున్నర కిలోల తరుగు తీసేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. తరుగు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమీ మాట్లాడారో సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయని అన్నారు. ఆనాడు వాళ్లు చెప్పిన దాని ప్రకారం.. ఎట్టిపరిస్థితుల్లో రైతుకు అన్యాయం చేయకుండా.. తరుగు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా, నిర్మల్ జిల్లా లక్ష్మణ్చందాలో రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో ధాన్యం బస్తాలతోనే నిరసన తెలిపారని తెలిపారు. వరంగల్ జాతీయరహదారిపై ధర్నా చేయడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో వరిధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ధర్నా చేశారని చెప్పారు. కేవలం నాలుగు జిల్లాలల్లో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రైతులు గత 25, 30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయకుండా, అధికారులు పట్టించుకోకపోవడంతో దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని.. వెంటనే కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే రైతన్నల తరఫున ప్రశ్నించడమే కాకుండా.. అవసరమైతే రోడ్డెక్కి.. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని టీఆర్ హెచ్చరించారు. రైతులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. మీ తరఫున కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉందని ధైర్యం చెప్పారు. రైతులు ఎప్పుడు పిలిచినా.. ఎక్కడికి పిలిచినా వస్తామని అన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు వాళ్ల తరఫున ఉంటామని తెలిపారు. రైతులకు రుణమాఫీ జరిగే వరకు, పంట బోనస్ వచ్చే వరకు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ప్రజల తరఫున, రైతుల తరఫున నిలబడి మాట్లాడతామని తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని, ఎవరూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు.