PBKS vs RR | రాజస్థాన్ రాయల్స్ను పంజాబ్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో వరుసగా వికెట్లను కూడా పడగొట్టారు. మధ్యలో రియాన్ పరాగ్ (48) ఒక్కడు పంజాబ్ ధాటిని తట్టుకుని నిలకడగా ఆడినప్పటికీ.. హాఫ్ సెంచరీ పూర్తి చేసేలోపే ఔటయ్యాడు. అయినప్పటికీ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ ముందు 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ను కోల్పోయింది. అప్పట్నుంచి పంజాబ్ బౌలర్లు కట్టడి చేస్తూనే వచ్చారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యేసరికి రాజస్థాన్ బ్యాటర్లు కేవలం 38 పరుగులు మాత్రమే చేశారు. ఏడో ఓవర్లో రాజస్థాన్ రెండో వికెట్ను కోల్పోయింది. నాథన్ ఎలిస్ వేసిన 6.4 ఓవర్కు బ్యాక్వర్డ్ పాయింట్లో రాహుల్ చాహర్కు సంజూ శాంసన్ (16 ) క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే 8వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (18 ) క్యాచ్ ఔటయ్యాడు. పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా చాలాసేపటి దాకా రాజస్థాన్ నెమ్మదిగా ఆడింది. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 58 పరుగుల వద్దే ఆగిపోయింది. కానీ అశ్విన్, రియాన్ పరాగ్ కలిసి జట్టుకు కీలక స్కోర్ అందించారు.
అయితే 13 ఓవర్లో చివరి బంతికి అశ్విన్ (28 ) శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పట్నుంచి వరుస ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్లో ధ్రువ్ జురెల్(0) డకౌట్ అయ్యాడు. 15వ ఓవర్లో రాహుల్ చాహర్ వేసిన బంతికి రొవ్మన్ పావెల్ (4) బౌలర్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. 18వ ఓవర్లో డోనవస్ ఫెరీరా (7 ) ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద రిలీ రోసో సూపర్ క్యాచ్ అందుకోవడంతో ఫెరీరా వెనుదిరిగాడు. రియాన్ పరాగ్ ఒక్కడే ధీటుగా ఆడినప్పటికీ.. హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక చివరి బంతికి బౌల్ట్ (12) రనౌట్ అయ్యాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 145 పరుగుల టార్గెట్ సెట్ చేసింది.