న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేసేందుకు కేంద్రం ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ (పీఎల్ఐ) స్కీమ్ లక్ష్యాలను చేరుకోలేక ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీ సంస్థలు విలవిల్లాడుతున్నాయి. పీఎల్ఐ కింద ఎంపికైన 16 సంస్థల్లో 15 ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నట్లు ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేసింది.
స్థానికంగా ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు భారతీయ కంపెనీలకు పీఎల్ఐ స్కీమ్ కింద 2019-20లో సేల్స్పై 4-6 శాతం ఇన్సెంటివ్లను కేంద్రం ప్రకటించింది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్న సంస్థలకు ఈ స్కీమ్ వర్తింపజేస్తామని పేర్కొంది.
కానీ గతేడాది అమలులో ఉన్న కరోనా ఆంక్షలు.. హువావేపై అమెరికా నిషేధం తదితర కారణాల వల్ల చిప్ల కొరతతో పీఎల్ఐ స్కీమ్ కింద ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీలో భారతీయ సంస్థలు క్వాలీఫై కాలేకపోతున్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈ నెల 27వ తేదీన లేఖ రాసింది.
పీఎల్ఐ స్కీమ్ అమలుకు 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా కేంద్రం ప్రకటించింది. గత అక్టోబర్లో ప్రారంభమైన ఈ పథకం ఈ నెలాఖరు వరకు అమలులో ఉంటుందని తెలిపింది.
కానీ వివిధ కారణాల వల్ల ఒక్క సంస్థ మినహా ఇతర స్మార్ట్ఫోన్ తయారీ పీఎల్ఐ తయారీ సంస్థలు వివిధ సవాళ్లతో క్వాలిఫికేషన్ పొందలేకపోతున్నాయని ఐసీఈఏ తెలిపింది. ఈ నేపథ్యంలో 2020-21ని బేస్ ఇయర్గా పరిగణించి ఐదేండ్ల పాటు పీఎల్ఐని అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది.
పాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, లావా ఇంటర్నేషనల్ అండ్ ఓప్టైమస్ ఎలక్ట్రానిక్స్తో సహా విదేశీ సంస్థలు ఫాక్స్కాన్ హాన్హాయి, రైజింగ్ స్టార్, విస్ట్రాన్, పెగాట్రాన్, శ్యామ్సంగ్ తదితర స్థానిక మొబైల్ హ్యాండ్సెట్ మాన్యుఫాక్చరర్లు.. పీఎల్ఐ బెనిఫిట్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుల నుంచి చిప్ల కోసం భారీ డిమాండ్ నెలకొంది.
కరోనా అనంతరం తలెత్తిన డిమాండ్ను అందుకునేందుకు అంతర్జాతీయంగా సెమీ కండక్టర్ తయారీ సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనాకు ముందే చైనా టెలికం దిగ్గజం హువావేపై వాణిజ్య యుద్ధంలో భాగంగా అమెరికా ఆంక్షలు విధించడం వల్ల కూడా చిప్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీ సంస్థలు చెబుతున్నాయి.
కరోనా మహమ్మారి వల్ల తమ పరిశ్రమపై పూర్తిగా ప్రభావం పడిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై) శాఖకు రాసిన లేఖలో ఐసీఈఏ పేర్కొంది. చిప్ కొరతతోపాటు పలు ఇబ్బందుల వల్ల ఉత్పాదక లక్ష్యాలను చేరలేకపోతున్నట్లు మాన్యూఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియా (ఎంఏఐటీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జి పాల్ తెలిపారు.
కరోనా నుంచి త్వరితగతిన చైనా కోలుకోవడం కూడా కాంపొనెంట్లు, ఇతర కంపెనీల పరికరాల సరఫరాపై ప్రభావం పడిందన్న విమర్శ ఉంది. ప్రయాణ ఆంక్షలు, క్యాపిటల్ గూడ్స్ కొరత, అంతర్జాతీయంగా కంటైనర్ల కొరత తదితర సమస్యలు లక్ష్యాలను చేరుకోకపోవడానికి కారణాలని తెలుస్తున్నది.
మోటార్ ఫీల్డ్కు జంట సవాళ్లు: కండక్టర్ల కొరత+చిప్ల ధరలు పైపైకి..!!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!