న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల కుదేలవ్వని రంగమంటూ లేదు.. ఆ జాబితాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఉంది. అయితే, రియల్ ఎస్టేట్ డెవలపర్లు తాము నిర్మించిన ఇండ్ల విక్రయాన్ని పెంచుకోవడానికి. సొంతింటి కల సాకారం చేసుకోవాలని కలలు కనే వారిని ఆకర్షించడానికి భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేశారు.
2020లో కరోనా వల్ల 87 శాతం రియల్ ఎస్టేట్ బిజినెస్ దెబ్బ తిన్నది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో డెవలపర్లు ఇచ్చిన ఆకర్షణీయ డిస్కౌంట్లకు ఫలితం దక్కిందని ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్ఫామ్ నో బ్రోకర్ డాట్కామ్ నిర్వహించిన సర్వేలో తేలింది.
87 శాతం మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు తాము ప్రతిపాదించిన డిస్కౌంట్ల పట్ల ఇండ్ల కొనుగోలు దారులు మొగ్గు చూపారని, ఫలితంగా ఇండ్ల విక్రయాలు పుంజుకున్నాయని చెప్పారు. 2019 ద్వితీయార్థంతో పోలిస్తే 2020 ద్వితీయార్థంలో ఇండ్ల విక్రయాలు మెరుగయ్యాయని 76 శాతం మంది డెవలపర్లు తెలిపారు.
ఇండ్ల విక్రయాలను ప్రోత్సహించడానికి కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీ తగ్గించడం కూడా పరిస్థితి మెరుగవ్వడానికి దారి తీసిందని నో బ్రోకర్ డాట్ కామ్ సహ వ్యవస్థాపకుడు కం సీబీవో సౌరబ్ గార్గ్ తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లోనూ సేల్స్ పెరుగుతాయని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు.
మూడింట రెండొంతల మంది డెవలపర్లలో 53 శాతం మంది ఐదు శాతం, వరకు 40 శాతం మంది 5-10 శాతం డిస్కౌంట్లు ఆఫర్ చేశారు. దీనికి తోడు ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో సడలింపులు కూడా తమకు మేలు చేశాయని డెవలపర్లు అంటున్నారు.
ఇంతకుముందుతో పోలిస్తే 2020లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2019-20 తొలి త్రైమాసికంతో పోలిస్తే, 2020-21 తొలి త్రైమాసికంలో దేశంలోని ఏడు నగరాల్లో 90 శాతానికి పైగా సేల్స్ పెరిగాయి.