Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్ (first chargesheet) రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. ఈ కేసులో కేజ్రీవాల్ను తొలిసారి నిందితుడిగా పేర్కొననున్నట్లు తెలిపాయి. ఈ కుంభకోణంలో కేజ్రీ ‘కీలక సూత్రదారు’ (kingpin)గా పేర్కొంటూ రూపొందించిన ఛార్జ్షీట్ను ఈడీ అధికారులు శుక్రవారం కోర్టులో సమర్పించనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా ఢిల్లీ సీఎం మధ్యంతర బెయిల్ను కోరారు. దీనిపై మే 7న విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఇక సుప్రీం తీర్పురోజే కేజ్రీవాల్పై ఈడీ తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవడం గమనార్హం. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.
Also Read..
Rahul Gandhi | అది మీ వ్యక్తిగత అనుభవమా?.. అంబానీ, అదానీ అంశంలో మోదీకి రాహుల్ కౌంటర్