ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
రామకృష్ణాపూర్, జూన్ 23: సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువును రెండు నెలల పాటు (12-08-2022 తేదీ వరకు) పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఆర్ఆర్నగర్లో కోటి రూపాయలతో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రామకృష్ణాపూర్ పట్టణంలో ద్వారక వైకుంఠపురం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే స్థల పరిశీలన పూర్తయిందని తెలిపారు. శుక్రవారం కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి చేతుల మీదుగా స్థానిక విజయగణపతి ఆలయంలో మూడో విడుత సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సింగరేణి ఏరియాల్లోని భూముల క్రమబద్ధీకరణ కోసం తీసుకువచ్చిన జీవో 76 ను గడువు పెంపుతో రామకృష్ణాపూర్ పట్టణంలో గతంలో చేసిన సర్వేలో పలు కారణాలతో మిస్సైన కాలనీలు భగత్సింగ్నగర్, రాజీవ్నగర్, శివాజీనగర్, జవహార్నగర్, శ్రీనివాస్నగర్, మల్లికార్జున్నగర్, గంగా కాలనీ, విద్యానగర్, ఆర్కే4 గడ్డ, పోస్ట్ ఆఫీస్ లేన్లకు చెందిన స్థలాల క్రమబద్ధీకరణకు వెసులుబాటు కలగనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విప్ను వార్డు ప్రజలు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, వార్డు కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, కమిషనర్ వెంకటనారాయణ, కౌన్సిలర్లు అలుగు శ్రీలత సత్తయ్య, పొలం సత్యం, రేవెల్లి ఓదెలు, అనిల్రావు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నేడు కార్మిక మంత్రి మల్లారెడ్డి పర్యటన
కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ క్యాతనపల్లి మున్సిపాలిటీ, మందమర్రి మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీవిజయగణ ఆలయ ప్రాంగణంలో సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ చేయనున్నారు. అనంతన మన ఊరు- మన బడి, పలు నిర్మాణ పనులు, భవనాలను ప్రారంభించనున్నారు.