నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 23 : నిర్మల్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టకుని రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ ము న్నూరుకాపు సంఘం వద్ద ఎస్సై రాజేశ్వర్ గౌడ్ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తోకల రాజేశ్వర్ ప్లాస్టిక్ కవర్లో 245 గ్రాము ల విడి గంజాయిని తీసుకుని అతని కస్టమర్కు విక్రయిద్దామని వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి రాజేశ్వర్ను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిం ది. ఆయనను విచారించగా షేక్ సోహెల్ వద్ద కొని ఇతరులకు అమ్ముతున్నట్లు తెలిపాడు. గంజాయిని స్వాధీన పర్చుకుని షేక్ అమీర్ సోహెల్ కోసం గాలిస్తుండగా మంగళవారం బస్టాండ్ వద్ద పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 139 గ్రాము ల గంజాయి, గంజాయి అమ్మగా వచ్చిన డబ్బులు రూ.4,140, టీఎస్ 11ఈపీ 5702 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ అనిల్ కుమార్, ఎస్సై రాజేశ్వర్ ఉన్నారు.
మరో ఇద్దరు..
భైంసా, ఏప్రిల్ 23 : భైంసా పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమవేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఖాజీగల్లికి చెందిన ముజాహిద్ ఖాన్, రాహుల్ నగర్కు చెందిన షేక్ మక్బూల్ బస్టాండ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై షరీఫ్ సిబ్బందితో కలిసి చేరుకున్నారు. దీంతో పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,142 గ్రాముల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మహారాష్ట్రలోని నాందెడ్కు చెందిన షరీఫ్ నుంచి పది రోజుల కిందట 2 కిలోల పొడి గంజాయి తెచ్చినట్లు వెల్లడించారు. పట్టణానికి చెందిన మహ్మద్ బారికి 250 గ్రాములు, తురాబ్ ఖాన్కు 209 గ్రాములు, రాహిల్కు 100 గ్రాములు విక్రయించినట్లు వెల్లడించారు. నాందెడ్కు చెందిన షరీఫ్తోపాటు స్థానికంగా గంజాయి కొనుగోలు చేసిన ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రాజారెడ్డి, ఎస్సై షరీఫ్ ఉన్నారు.