నస్పూర్, ఏప్రిల్ 22 : లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఓటరు సెల్ఫీ బోర్డులను అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఆర్డీవో కిషన్, సహాయ కార్మిక శాఖ కమిషనర్ వినీతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధమని, ఓటు ద్వారా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, విద్యుత్, ఫ్యాన్లు తదితర సౌకర్యలు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఓటరు సెల్ఫీ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య, స్వీప్ సమన్వయకర్త రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, సీ విజిల్, వీడియో పరిశీలన, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, మీడియా సెంటర్ను అదనపు కలెక్టర్, డీఆర్డీవో, సహాయకార్మిక శాఖ కమిషనర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, ఈడీఎం సునీల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి సెగ్మెంట్లలో ఎన్నికలు సజావుగా సాగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూంతో పాటు టోల్ఫ్రీ నంబర్ 1950ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు, ప్రచార కార్యక్రమాల రికార్డులను పరిశీలించి, తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఏప్రిల్ 22 : ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 24న ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో మీడియా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. మీడియా ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.