హైదరాబాద్ : క్షణకావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. శనివారం ప్రేమ విఫలమై శివ అనే యువకుడు సరూర్నగర్ లేక్లో దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఇది గమనించిన హోంగార్డ్ మంత్రి ఈశ్వరయ్య గమనించి, రక్షించాడు. తర్వాత అతనికి ప్రథమ చికిత్స అందించి.. యువకుడిని అతని సోదరునికి అప్పగించాడు. ఈ సందర్భంగా హోంగార్డును కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ అభినందించి, నగదు పారితోషకం అందజేశారు. ప్రధానమంత్రి సేవ్ లైఫ్ పతకానికి ఈశ్వరయ్య పేరును సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సరూర్నగర్ లేక్ వద్ద రెండేళ్ల కింట అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు సీపీ తెలిపారు. ఇప్పటి వరకు ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురిని రక్షించినట్లు పేర్కొన్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని సూచించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో సైకాలజీ సెంటర్ ఏర్పాటు చేశామని, సేవలను వినియోగించుకోవాలన్నారు. కాల్ సెంటర్ 040-48214800ను సంప్రదించవచ్చని చెప్పారు.
ప్రశాంతంగా లాక్డౌన్
కమిషనరేట్ పరధిలో లాక్డౌన్ ప్రశాంతంగా సాగుతోందని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 52 చెక్పోస్టులు చేసినట్లు చెప్పారు. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 56,466 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘనలపై 41,990 కేసులు, మాస్క్లు ధరించని 11,638 మందిపై, గ్యాదరింగ్పై 601, భౌతికదూరం పాటించని 1,823 మందిపై, బహిరంగంగా మద్యం తాగిన వారిపై 414 కేసులు నమోదు చేశామన్నారు. అలాగే లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన 13,490 వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు.