న్యూఢిల్లీ : గాలిలో ఎగురుతున్న విమానంలో ఒక్కసారిగా గబ్బిలం కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి నేవార్క్కు శుక్రవారం తెల్లవారు జామున 2.20 గంటలకు ఎయిర్ ఇండియా(బీ777-300ఈఆర్) విమానం బయలుదేరింది. అరగంట ప్రయాణం తర్వాత విమానంలోని క్యాబిన్లో గబ్బిలాన్ని గుర్తించిన పైలట్.. వెంటనే ఏటీసీకి సమాచారం అందించి.. తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడు. ఉదయం 3.55కి విమానం ఎయిర్పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయ్యింది.
ఆ తర్వాత వైల్డ్లైఫ్ స్టాఫ్ను పిలిపించడంతో, వారు ఆ గబ్బిలాన్ని పట్టుకుని తీసుకెళ్లారని డీజీసీఏ అధికారులు తెలిపారు. విమానంలో పొగలు వచ్చాయని, బిజినెస్ క్లాస్ ఏరియాలో గబ్బిలం మృతి చెందిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. థర్డ్ పార్టీలతోనే ఇలా క్షీరదాల రాక జరుగుతోందని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులను మరో విమానంలో నేవార్క్ పంపారు.