న్యూఢిల్లీ : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, ఈ మేరకు వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రం సమాచారం ఇచ్చింది. యాస్ తుఫానుపై ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఆదేశాలు వచ్చాయి. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే బలవంతంగా డెప్యూటేషన్పై కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించింది.
1987 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలచినట్లు, ఈ మేరకు కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపిందని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం శుక్రవారం సమాచారం పంపింది. తక్షణమే ఆయనను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం ఢిల్లీలోని డీఓపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆయనకు సూచించింది. మే 31 నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండనున్నాయి. వాస్తవానికి సోమవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం ఆరు నెలల పాటు పెంచాలని కోరుతూ ఈ నెల 12న మమత ప్రధానికి లేఖ రాశారు.
ఈ మేరకు మూడు నెలల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. బంధోపాధ్యాయ్ గత ఏడాది సెప్టెంబర్లో సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ శుక్రవారం జరిపిన సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాస్త ఆలస్యంగా వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్లు ఆదేశాలు రావడానికి వెనుక కారణం ఇదేనేమోనని చర్చ జరుగుతోంది.