న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కేసులో ఏడాది కిందట అరెస్టయిన పింజ్రాటాడ్ సభ్యులు నటాషా, నర్వాల్, దేవంగన కాలిత, జామియా ఇస్లామియా విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్స్ కోర్టు ముగ్గురికి బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను.. జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, అనుప్ జైరాం భంబానీల ధర్మాసనం వారికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.50వేల పూచీకత్తు సమర్పించడం, పాస్పోర్టు అప్పగించడంతో పాటు దర్యాప్తును ప్రభావితం చేయడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
బెయిల్పై పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసన.. ఉగ్రవాదం కాదని.. రాజ్యాంగబద్ధమైన హక్కు అని.. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 40 మందికిపైగా మృతి చెందగా.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగ్గా, ఎంతో మంది నిరాశ్రయులయ్యారు.
దేవాంగన కళిత, నటాషా నర్వాల్ ఇద్దరూ ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పీహెచ్డీ స్కాలర్లు కాగా.. ఆసిఫ్ ఇక్బాల్ తన్హా జామియా యూరివర్సిటీలో బీఏ థర్డ్ ఇయర్ విద్యార్థి. ఈ ముగ్గురూ పింజ్రా టాడ్ అసోసియేట్ అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని సీలంపూర్ మదీనా మసీదు వద్ద పింజ్రా టాడ్ నిర్వహించిన ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు.
ఆందోళనకారులతో కలిసి పెద్ద ఎత్తున ఛక్కా జామ్ చేపట్టారు. హింసాత్మక ఆందోళనల్లో వారి ప్రమేయం ఉందనే కారణంతో యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జైలులో ఉండగా.. ఆ ముగ్గురికీ తాజాగా బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సీనియర్ అడ్వోకేట్ ప్రశాంత్ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు.