India : ఇండియా, మయన్మార్.. పక్కపక్కనే ఉన్న సరిహద్దు దేశాలు. వందల కిలోమీటర్ల సరిహద్దును ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. అయినప్పటికీ, ఇంకా కొంత భూభాగం విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనికి పరిష్కారంగా ఇరు దేశాలు సరిహద్దుల్ని మార్చుకునే అవకాశాలున్నాయని కేంద్రం తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రతిపాదన, చర్చల దశలోనే ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ఇండియా, మయన్మార్ కలిసి 1,643 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇందులో 1,472 కిలోమీటర్ల సరిహద్దును గుర్తించగా, 171 కిలోమీటర్ల సరిహద్దు విషయంలోనే వివాదం నడుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరంలతో మయన్మార్కు చెందిన సగాయింగ్ ప్రాంతంతోపాటు, చిన్ రాష్ట్రాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇందులో ఎక్కువగా పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలే ఉన్నాయి. కొన్ని జాతుల తెగలు ఇరువైపులా నివసిస్తున్నారు. అయితే, రెండు దేశాల మధ్య మణిపూర్ ప్రాంతంలో కొంత సరిహద్దు విషయంలో వివాదం నడుస్తోంది. ఇక్కడ సరిహద్దును ఇంకా నిర్ణయించుకోలేదు. దశాబ్దాలుగా ఈ సమస్య ఇలాగే నానుతోంది. దీంతో రెండు దేశాల మధ్య చట్టబద్ధంగా సరిహద్దును నిర్ణయించుకునేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. సరిహద్దులో 65, 68 పిల్లర్ల మధ్య మణిపూర్తో ఉన్న 1.4 చదరపు కిలోమీటర్ల సరిహద్దుతోపాటు, 2.8 కిలోమీటర్ల పొడవు సరిహద్దును మార్చుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ నెలలోచే చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. అలాగే, ఇతర సరిహద్దు విషయంలోనూ వివాదం ఉండగా.. దానిపై కూడా చర్చలు జరుగుతాయి. సరిహద్దు వివాదం పరిష్కారమైతే చుట్టూ కంచె వేయాలని ఇండియా నిర్ణయించింది. మొత్తం 1,643 కిలోమీటర్ల మేర సరిహద్దులో కంచె వేసి, అంతర్జాతీయ సరిహద్దుగా ప్రకటిస్తారు. మరోవైపు సరిహద్దును మార్చుకోవడాన్ని మణిపూర్లోని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సంఘాలు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేశాయి.