తుంగతుర్తి, ఆగస్టు 05 : తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న సైబర్ నెలలపై విద్యార్థులు ఆన్లైన్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా డిజిటల్ భద్రతా ప్రమాణాలను తెలుసుకోవడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
విద్యార్థులు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని గేమ్స్ ఆడేటప్పుడు, ఆన్లైన్ టాస్క్ల పేరుతో వచ్చే నకిలీ ఆఫర్లను, లాటరీలను నమ్మి మోసపోవద్దని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.