అమరావతి : గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ క్రస్ట్ గేటు ప్రమాదవశాత్తు ఊడిపోయింది. నీటి ఒత్తిడి కారణంగా గేట్ ఊడడంతో వరద నీరంతా వృథాగా పోతున్నది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు గేటు ఊడిపడింది. దీంతో దాదాపు 1.60లక్షల క్యూసెక్కులపైగా నీరు వృథాగా పోతున్నది. డ్యామ్లో నీటి ఒత్తిడి తగ్గించేందుకు ఏడు గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు.
అయితే, ఎమర్జెన్సీ గేటు బిగించేందుకు ప్రయత్నించినా వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సాధ్యం కావడం లేదు. గేట్ ఊడడంతో ప్రస్తుతం ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలను నిలిపివేశారు. మరో వైపు ఎమర్జెన్సీ గేట్ను బిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా.. ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.34 టీఎంసీలు నిల్వ ఉన్నది.