గోరఖ్పూర్ : యూపీ మహారాజ్గంజ్లోని ఇండో-నేపాల్ సరిహద్దులోని ఓ గ్రామంలో శాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), స్థానిక పోలీసుల సంయుక్త బృందాలు దాడులు జరిపి రూ.686 కోట్ల విలువైన నిషేధిత సైకోట్రోపిక్ డ్రగ్స్ను పట్టుకున్నాయి. తుతిబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని జముయి కాలాలో రమేశ్కుమార్ గుప్తా అనే వ్యక్తికి చెందిన ఓ గోడౌన్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎం ఉజ్వల్ కుమార్, ఎస్పీ ప్రదీప్ గుప్తా, ఎస్ఎస్బీ కమాండెంట్ మనోజ్కుమార్ తెలిపారు.
గోవింద్ గుప్తా అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ను నేపాల్కు పంపేందుకు గిడ్డంగిలో నిల్వ చేసినట్లు చెప్పారు. నిందితులపై సైకోట్రోపిక్ యాక్ట్తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గోదాం నుంచి 104 ఇంజెక్షన్లు, 18,782 సిరప్ బాటిళ్లు, 3,13,384 క్యాప్సూల్స్, 1,24,897 టాబ్లెట్లు, 1,34,460 ప్రింటెడ్ ప్రైస్ లేబుల్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.