భోపాల్ : జనవరి నుంచి సియోనిలోని పెంచ్ టైగర్ రిజర్వులో మూడు పులులు మరణించాయి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు నమూనాలను పంపినా మరణాలకు కారణాలు తెలియరాలేదు. అనంతరం రక్తం, ఒరోఫారింజియల్ నమూనాలను తీసుకోవాలని అటవీశాఖ అధికారులు నిర్ణయించారు. వీటితో పాటు భారత్లో తొలిసారిగా పులులకు కొవిడ్-19 పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెంచ్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్ వీఎస్ పరిహార్ మాట్లాడుతూ గత 20 రోజులుగా అటవీశాఖకు చెందిన ఆరుగురు అధికారులు రెండు ఏనుగుల సహాయంతో నమూనాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే, ఇప్పటి వరకు పులులను గుర్తించలేదని తెలిపారు.
గతంలో పులుల సంఖ్యను లెక్కింగా.. టైగర్ రిజర్వులో 53 ఉన్నాయని పేర్కొన్నారు. జనవరి నుంచి 5-8 సంవత్సరాల మధ్య వయస్సున్న మూడు పులులు మరణించాయని పరిహార్ తెలిపారు. వాటి మృతదేహాలపై విషం, గాయాల గుర్తులు కనిపించనందున పోస్టుమార్టం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక సైతం ‘వేట’ అవకాశాలను సైతం తోసిపుచ్చింది. ఈ క్రమంలో మిగతా పులులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరణానికి ఇతర వైరస్లు ఏమైనా కారణమా? అని ఆరా తీయనున్నారు. మరణాల వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు కనీసం ఐదు పులుల నమూనాలు సేకరించేందుకు అనుమతి కోరుతూ పెంచ్ టైగర్ రిజర్వ్ పరిపాలన గత నెలలో అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి లేఖ రాసినట్లు ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) అలోల్కుమార్ చెప్పారు.
ఇదిలా ఉండగా.. పెంచ్ రిజర్వ్లో పదేళ్ల మృతిపై సమగ్ర దర్యాప్తు కోరుతూ గతేడాది పర్యావరణ కార్యకర్త సంగీత డోగ్రా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొవిడ్ -19 కారణంగా పులి చనిపోయిందని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పులి మరణానికి కారణమేంటో నిర్ధారించాలని అత్యున్నత న్యాయస్థానం పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. అయితే, కరోనా కారణంగా పులి చనిపోయిందన్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.