తిరుమల : భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం ఉదయం విడుదల చేసింది. కరోనా సంక్రమణ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే టికెట్లను అందుబాటులో ఉంచింది. రోజుకు ఐదువేల చొప్పున టికెట్లను మాత్రమే ఆన్లైన్లో విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది. దర్శన సమయాల్లో మాస్క్ ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించింది.