KCR | అరచేతిలో వైకుంఠం చూపించి.. మనల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని తెలిపారు. రైతులను, యువకులను.. అందర్నీ కాంగ్రెస్ పార్టీ వంచించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిందని.. ఒక్క ఉచిత బస్సు మినహా ఏది కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. గత 15 రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం నాడు మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్ చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఐదు నెలల్లోనే రాష్ట్రం ఇంత ఆగమాగం ఎందుకయ్యిందని ప్రశ్నించారు.
రైతుబంధు కూడా రేపు రేపు వ్యవసాయం చేసినోళ్లకే ఇస్తారంట.. పొలం దున్నినోళ్లకే ఇస్తారంట అని కేసీఆర్ అన్నారు. ఇంతకుముందు అట్ల వచ్చిందా? ఇంతకుముందు అందరికి వచ్చింది కదా? అని ప్రశ్నినంచారు. రైతుబంధు నాట్లు వేసేటప్పుడు ఇయ్యాలి.. కానీ కోతలు అయినయ్.. కల్లాలు అయినయ్ ఇప్పుడు రైతుబంధు వేస్తామని అంటారు. ఇంతకంటే జోక్ ఏమైనా ఉంటదా? అని అడిగారు. తల, తోక లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా తెలంగాణను నష్టపరుస్తుందని మండిపడ్డారు. కరెంటు కోతల కారణంగా హైదరాబాద్లో పరిశ్రమలు వెళ్లిపోయే, ఐటీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ మంచినీళ్ల కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్కు ప్రత్యేక లైన్ వేయించినా.. కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింక్ కావాలని.. శంకరంపేట నుంచి కాల్వలు తవ్వుతున్నారు.. మల్లన్నసాగర్ నుంచి ఒక్కసారి నీళ్లు రావడం మొదలైతే.. నర్సాపూర్ బంగారు తునక అవుతుంది.. దాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదనే నమ్మకం లేదు. ఆ కాల్వ పూర్తి కావాలి.. మల్లన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నీళ్లు రావాలంటే ఎంపీగా వెంకట్రామిరెడ్డి గెలవాలి.’ కేసీఆర్ తెలిపారు. మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చేలా లేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇంకా నెరవేరుస్తదనే ఆశ లేదని అన్నారు.
నర్సాపూర్ను కేసీఆర్ ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసిండో మీ అందరికీ తెలుసని అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇచ్చిన.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి డబ్బులు ఇచ్చినం.. వాటిని కూడా వాపస్ తీసుకెళ్తున్నారని చెప్పారు. కొల్చారం మండలంలో మల్లినాథ సూరి పేరు మీద యూనివర్సిటీని పెడదామని అనుకున్నాం.. దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేలా లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హల్దీవాగు మీద, మంజీరా నది మీద 10 చెక్డ్యామ్లు కట్టాం.. దాని ద్వారా పంటలు పండించుకున్నాం.. దాన్నంతా దెబ్బ తీసే పరిస్థితులు వస్తున్నాయని పేర్కొన్నారు. అంటే సాగు నీరు రాదు.. తాగునీరు రావు.. కరెంటు రాదు.. సంక్షేమం లేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి దానికి ఏదో కొండి పెట్టడం, తొండి పెట్టడం, అబద్ధాలు చెప్పడం చేస్తుందని మండిపడ్డారు.