న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై (Swati Maliwal) దౌర్జన్యం కేసులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్కు (Bibhav Kumar) హజారీ కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. తనపై దాడి చేశారని ఎంపీ మలివాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఏడు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఆయనకు మే 23 వరకు కస్టడీ విధించింది. మరోవైపు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
మరోవైపు స్వాతి మలివాల్ ఆరోపణలు కట్టుకథేనని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఘటన రోజు నాడు వాస్తవాలు వెల్లడించే ఓ వీడియోను ఆప్ శనివారం ఎక్స్లో షేర్ చేసింది. ఆ వీడియోలో మహిళా రక్షణ సిబ్బంది స్వాతి మలివాల్ చేయి పట్టుకుని కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు పంపిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇంటి బయటివరకు ఆమె కూల్గానే వారితో నడుచుకుంటూ వచ్చారు. ఆమెకు దెబ్బలు తగిలినట్టు ఎక్కడా కనిపించ లేదు. ఇంటి మెయిన్ గేటు దాటిన తర్వాత సిబ్బంది నుంచి తన చేతులను విడిపించుకుని వారితో ఏదో అన్నారు.
కాగా, వివాదాలు, కేసులతో ఆప్ను అణగదొక్కలేరని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజల గుండెల్లో ఆప్ స్థానం సంపాదించుకున్నదని, ఒక్క నాయకుడిని జైల్లో పెడితే.. వందలాది మంది నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు. ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు ‘జైల్ భరో’ ఆందోళన చేపడతామని ప్రకటించారు. తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్కుమార్ అరెస్టుపై కేజ్రీవాల్ ఈ మేరకు స్పందించారు.