ఖమ్మం/ రఘునాథపాలెం, అక్టోబర్ 12: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ ఆలయం పూర్తయితే ఖమ్మంజిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెం, అల్లీపురంలోని ప్రభుత్వ భూములు, అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థలాల సేకరణ సాధ్యాసాధ్యాలపై మ్యాప్లను పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. టీటీడీ అధికారులు, స్తపతి, పండితులు ఖమ్మం నగరానికి వచ్చి ప్రతిపాదిత స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆలయానికి అనువైన భూమిని ఖరారు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, ఇతర అధికారులు ఉన్నారు.