మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రజాప్రతినిధులు ఎలాంటి వరాలు ప్రకటించరాదు. కానీ, సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జహీరాబాద్ ఎంపీ ఎన్నికల జన జాతర విజయభేరి సభకు హాజరై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గానికి హామీలు గుప్పించారు. ఇంటర్మీడియట్లో మొదటి, రెండో సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని, వారికోసం మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ, పీజీ కళాశాల, ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రాంతీయ పారిశ్రామికరణ కేంద్రం ఏర్పాటు, సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పెద్దశంకరంపేటలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిండుసభలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీనికి సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. నారాయణఖేడ్కు 24/7 లైబ్రరీకి ఎస్డీఎఫ్ కింద రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. మహిళా ఐటీఐ మంజూరు చేస్తున్నానని, నారాయణఖేడ్లో 2వేల ఎకరాలు భూసేకరణ చేసి 30 రోజుల్లో అప్పగిస్తే ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తద్వారా యువతకు, మహిళలకు ఉపాధి దొరుకుతుందని, ఇవన్నీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.