నిజామాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో వచ్చే కామారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో నిర్వహించిన బస్సుయాత్రలో కేసీఆర్ ఆశేష జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాను కాపాడుకుంటారా… పోగొట్టుకుంటారా మీ ఇష్టం అని కేసీఆర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా ఉండాలంటే కచ్చితంగా జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ గెలవాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీలైతేనే మన సమస్యలపై కొట్లాడుతారని, మన భవిష్యత్తు కోసం పోరాడుతారని వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షోకు అద్భుత స్పందన వచ్చింది. భారీ జనసందోహం మధ్య నిజాంసాగర్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు వరకు కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగింది. జేపీఎన్ రోడ్డులో ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.