సిద్దిపేట, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను తీసేస్తా అని చెబుతున్నాడు. దానిలో మెదక్ జిల్లా కూడా తీసేస్తా అంటున్నాడు. మెదక్ జిల్లా ఉండాలా..? పోవాలా..? మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలి..’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో రోడ్షోలో భారీగా తరలివచ్చిన జనాన్నినుద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ… ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. బ్రహ్మాండంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ చేసుకున్నామన్నారు. ఇదే కాంగ్రెస్, టీడీపీ రాజ్యంలో మొత్తం ఘనపురం ప్రాజెక్టును ఏవిధంగా నాశ నం చేశారో మీ అందరికీ తెలుసన్నారు. అనేక బాధలు అనుభవించిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.150 కోట్లతో ఘనపురం అనకట్ట బాగు చేసుకున్నామని గుర్తుచేశారు. ఆనకట్ట ఎత్తును పెంచుకున్నామన్నారు. ఆనాడు వంద పడకల దవాఖాన మెదక్కు కావాలని తెచ్చిపెట్టామన్నారు. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని 50 పడకలకు కుదించిందని ఆరోపించారు. ఏడుపాయల జాతరను బ్రహ్మాండంగా జరగాలని, ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలని రూ.100 కోట్లు తాను మంజూరు చేస్తే దానిని కాంగ్రెస్ ప్రభు త్వం తీసుకొని పోయిందన్నారు. మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, రామాయంపేట మున్సిపాలిటీ కోసం నిధులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేశారన్నారు. ఇవన్నీ వాపస్ తీసుకుపోయారన్నారు. కాంగ్రెసోళ్లు కొత్త హామీలు అమలు చేయకపోగా, బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్లున్నీ రద్దు చేస్తున్నారని, ఈ విషయాన్ని మీరంతా గమనించాలని కేసీఆర్ కోరారు.
‘ఇదే జిల్లా బిడ్డను, మీ అందరి కోసం ఎంత పని చేసినానో మీకు తెలుసు ..మెదక్ ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకున్నామో మీ అందరికీ తెలుసు’.. అని కేసీఆర్ అన్నారు. మెదక్లో హల్దీవాగు హరీశ్రావు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు. దానిని మల్లన్నసాగర్తో లింక్ చేసుకున్నామన్నారు. హల్దీవాగు మీద ఎన్నో చెక్డ్యామ్లు కట్టుకున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లింక్ కలుపుకొన్నట్లు తెలిపారు. ఎప్పడు కూడా మంజీరా నది, హల్దీ వాగు ఎండిపోకుండా రైతుల పొలాలు పారేటట్లు అభివృద్ధి చేసుకున్నామన్నారు. దీనిని అంతా చెడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నదన్నారు. దీనిని మనం కాపాడుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నదులను కాపాడుకోవాలన్న, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయించాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలన్నారు. 9 ఏండ్లు నిమిషం కరెంట్ పోకుండా రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు. ఇవాళ కరెంట్ కోతలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ది అసమర్థ ప్రభుత్వం అని కేసీఆర్ విమర్శించారు. రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, బోనస్ రావడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు మీరంతా తనను దీవించారన్నారు. ఐదు నెలల క్రితం తెలంగాణ ఎట్లా ఉండే ..ఈ ఐదు నెలల్లోనే ఎంత ఆగంఆగం అయితా ఉంది మీరంతా గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చట్టబద్ధత చేస్తామని చెప్పారన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి దగా చేసిందని, మోసం చేసిన విషయం మీ అందరికీ తెలుసన్నారు. వాళ్ల నోటికి వచ్చినట్టు వాగ్ధ్దానాలు చేశారని, వాళ్లు ఇచ్చిన ఏది కూడా అమలు కాలేదని అన్నారు. రైతుబంధు మీ అందరికీ వచ్చిందా అని కేసీఆర్ అడిగారు. రాలేదు అని..నిన్న మొన్న ఏస్తామనిచెప్పిం డ్రు..మహిళలకు రూ.2500 వచ్చినాయా? మెదక్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా వచ్చిందా? రాలేదా? దగా చేసినట్లు కాదా? రెండు లక్షల రుణమాఫీ జరిగిందా? ఇట్లా అనేక 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమ లు చేస్తామని చెప్పి ఏది చేయలేదన్నారు.
‘బీజేపీ అభ్యర్థి రఘునందన్ నూటికి నూరు అబద్ధ్దాలు మాట్లాడుతారు. నరేంద్ర మోదీ ఎంత గ్యాసో..రఘునందన్ రావు ది కూడా అంతే గ్యాస్’.. అని కేసీఆర్ అన్నారు. అందులో ఏమి అనుమానం లేదని ..ఇది నిజమే కదా అని అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో ఇదే కొత్త ప్రబాకర్రెడ్డి చేతిలో దాదాపు 55 వేల ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయారని చెప్పారు. నేను ఒక్కటే మాట మిమ్మలి అడుగుతున్నాను.. అసెంబ్లీకే చెల్లని రూపాయి..మెదక్ పార్లమెంట్లో చెల్లుతుందా అని ప్రశ్నించారు. తక్కుతుక్కుగా ఓడగొట్టాలి, బుద్ధిచెప్పాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మోసం చేస్తే ఇక్కడ మేము ఎడ్డివాళ్లం కాదని, తెలంగాణ మళ్ల ఒక్కసారి పిడికిలి బిగించి మనం పోరాటానికి దిగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
మెదక్ పార్లమెంట్ నుంచి పోటీచేస్తున్న వెంకట్రామిరెడ్డి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారి అని కేసీఆర్ అన్నారు. ఇదే జిల్లాలో కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి అని, ఆయన డబ్బుల కోసం రాజకీయాలకు రాలేదన్నారు. ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు, తెలివి తేటలున్నవాడు వెంకట్రామిరెడ్డిని గెలిపించాలన్నారు. మిగతా అభ్యర్థుల గురించి మీకు తెలుసన్నారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాలకు రాలేదన్నారు. ఆయనకు పదవి ఉంది ..ఆయన కేసీఆర్ వెంబడి ఉండి తెలంగాణ అభివృద్ధి చేయాలని , మెదక్ జిల్లాను మరింతగా అభివృద్ధి చేయాలని హరీశ్రావుకు తోడుగా ఉండాలని చెప్పి ముందుకు వచ్చాడని చెప్పారు. ఆయన్ను స్వయంగా తానే తీసుకువచ్చాను అని కేసీఆర్ చెప్పారు. ఎన్నికలకు రాగానే వెంకట్రామిరెడ్డి ఒక మాట చెప్పారన్నారు. రూ. 100 కోట్లతో ట్రస్టు పెడతానని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫంక్షన్హాల్ నిర్మిస్తానని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. తన మాటను గౌరవించి వెంకట్రామిరెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. రాళ్లవాన పడ్డది, అయినప్పటికీ తరలివచ్చినందుకు ప్రజలకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.