సారంగాపూర్/ ధర్పల్లి/ఆర్మూర్టౌన్/మోర్తాడ్, మే 7: బీఆర్ఎస్ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ ప్రచారం చేపట్టారు. రూరల్ మండలంలోని సారంగాపూర్తో పాటు వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలపై వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి, బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎండీ. అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో పది రోజులుగా ప్రచారం కొనసాగుతున్నది.
ధర్పల్లి మండలకేంద్రంలో ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ప్రచారం చేశారు. రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, నాయకులు గంగారెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలోని పలు కాలనీలు, ఉపాధి హామీ పనుల ప్రదేశంలో మంగళవారం ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు ఇప్పటికీ అమలు చేయకుండా మరోసారి ప్రజలను మోసం చేసే ఆలోచనలో ఉన్నదని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పదేండ్లలో తెలంగాణను అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో నిలిపారని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బాజెరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఆర్మూర్ పట్టణంలోని 15వ వార్డు కౌన్సిలర్ చక్రు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల్లోని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ ప్రతి దుకాణాలకు తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఇచ్చిన హామీలకు సంబంధించి వీడీయోలను చూపిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు.