హైదరాబాద్ : దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తొలి అవగాహన సమావేశం ప్రారంభమైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఉదయం ప్రారంభమైన సదస్సు.. సాయంత్రం వరకు కొనసాగనున్నది. సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి, మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి వార్డుకు నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు.. ఇద్దరు మహిళలు) మొత్తం 412 మందితో పాటు 15 మంది రీసోర్స్ పర్సన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పథకం పర్యవేక్షణ, నిర్వహణపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నారు. అలాగే పథకం విజయవంతానికి అవసరమైన చర్యలను వివరించనున్నారు. సమావేశం కోసం హుజూరాబాద్ నుంచి ప్రగతి భవన్కు 16 బస్సుల్లో దళిత బంధువులు తరలివచ్చారు. బస్సులను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండా ఊపి ప్రారంభించారు.