న్యూఢిల్లీ : కృష్ణా నదీ జలాల వివాదంపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై గత సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వినగా.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలకు సీజేఐ సూచించారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తితనని పేర్కొన్నారు. పిటిషన్పై విచారణ జరుపడం తనకు ఇష్టం లేదని.. విచారణే కోరుకుంటే పిటిషన్ను మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ సూచనపై రెండు రాష్ట్రాల న్యాయవాదులు తమ ప్రభుత్వాలతో సంప్రదించి చెప్తామని కోరడంతో విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ విషయమై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగ్గా.. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారం కాదని ధర్మాసనానికి ఏపీ ప్రభుత్వం తెలిపింది. న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు సీజేఐకి చెప్పింది. మధ్యవర్తిత్వం కోరుకోకపోతే మేం మిమ్మల్ని బలవంతం చేయలేమని సీజేఐ అన్నారు. ఈ మేరకు విచారణ నుంచి తప్పుకుంటూ.. జస్టిస్ సూర్యకాంత్ బెంచ్కు పిటిషన్ను బదిలీ చేశారు. అయితే, సీజేఐ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపాలని కేంద్రం కోరింది. సీజేఐ వాదనలు విన్నందుకు రెండు రాష్ట్రాలకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇందుకు జస్టిస్ ఎన్వీ రమణ నిరాకరించారు.