Celebrities Business | ఏదైనా బ్రాండ్ ప్రచారం కోసం కార్పొరేట్ సంస్థలు హీరోలు, హీరోయిన్లను సంప్రదించడం ఆనవాయితీ. కానీ, ఏకంగా తమకంటూ సొంతంగా ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు చాలామంది తారలు. కొందరు నేరుగా వ్యాపారంలోకి దిగితే.. మరికొంతమంది పరోక్షంగా పెట్టుబడి పెట్టి కొన్ని ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. వీరంతా కేవలం స్కిన్ కేర్ ఉత్పత్తులపైనే దృష్టిపెట్టడం విశేషం.
భారతీయులు చర్మ, కేశ సంరక్షణకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మన వాతావరణానికి తగ్గట్లుగా, వినియోగదారుల మనసులు గెలిచేలా హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకురావడం అన్నది ఓ సవాలే. అందుకే, స్కిన్ కేర్ విభాగంలో చాలా ఉత్పత్తులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయిన బ్రాండ్స్ మాత్రమే మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. కాబట్టే, కొత్తగా స్కిన్ అండ్ హెయిర్కేర్ రంగంలో అడుగు పెట్టిన తారలు కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
‘పుష్ప’తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటి రష్మిక మందన్న. చర్మ సంరక్షణకు వేగన్ స్కిన్కేర్ బ్రాండ్ ‘ప్లమ్గాడ్సెస్’ ఉత్పత్తులనే ఆమె ఎక్కువగా వినియోగిస్తుంది. తన చర్మాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్నదనే కృతజ్ఞతతో ఏకంగా ఆ కంపెనీలో రష్మిక పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. ప్యాకేజింగ్ నుంచి ఫలితాల వరకూ.. అన్నీ తనను మెస్మరైజ్ చేశాయని అంటున్నది రష్మిక. అందుకే బ్రాండ్తో దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఆ బ్రాండ్కు తనే అంబాసిడర్గా వ్యవహరిస్తున్నది. ‘నా చర్మం, జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. సౌందర్య వ్యాపారంలో మరింత పారదర్శకత ఉండాలని నా ఆ ఆకాంక్ష’ అంటున్నది రష్మిక మందన్న.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఇటీవల ‘అనోమలీ’ అనే స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే అమెరికాలో అనోమలీ బ్రాండ్కు క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతిచోటా ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీంతో ఏడాది క్రితం అమెరికాలో అనామలీ ఉత్పత్తులను మార్కెట్ చేసుకొని బాగానే సంపాదించింది కూడా. ప్రస్తుతం ప్రియాంక చోప్రా నైకా సంస్థతో జతకట్టింది. దీని ద్వారా తన షాంపూలు, కండిషనర్లు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్నది. తాను ఇప్పటికీ పెరుగు, తేనె వంటి భారతీయ సంప్రదాయ సౌందర్య సాధానాలనే వాడతానని తెలిపింది ప్రియాంక. తన బ్రాండ్ ఉత్పత్తులను కూడా సహజసిద్ధమైన వనరుల నుంచే తయారు చేస్తునట్లు వెల్లడించింది.
బాలీవుడ్ రెబెల్స్టార్ రణ్వీర్ సింగ్ స్వదేశీ బ్యూటీ ఉత్పత్తుల కంపెనీ అయిన ‘షుగర్ కాస్మటిక్స్’లో ఇన్వెస్టర్ కూడా. ఇన్నాళ్లూ ఆ బ్రాండ్ ఉత్పత్తులను దగ్గరగా గమనించిన రణ్వీర్.. ఏకంగా పెట్టుబడి పెట్టి, ఓ యజమానిగా మారారు. ‘ఎన్నో సంవత్సరాలుగా ఓ మంచి బ్యూటీ బ్రాండ్ కోసం ఎదురుచూశాను. షుగర్ కాస్మటిక్స్తో ఆ బాధ తీరిపోయింది. భారతీయ మహిళల కోసం, భారతీయ వాతావరణానికి తగ్గట్లుగా, నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నది షుగర్ కాస్మటిక్స్. ఎంతోమంది వీటి నాణ్యతకు ఫిదా అయ్యారు’ అని అంటున్నారు రణ్వీర్. తమన్నా వంటి గ్లామర్ తారలతో తన ఉత్పత్తులకు ప్రచారం చేయిస్తున్నాడు. ‘నేను నంబర్ వన్ స్థానాన్ని కోరుకుంటాను. నా బ్రాండ్ కూడా అగ్రస్థానంలోనే ఉంటుంది’ అంటాడు కాన్ఫిడెంట్గా.
నటి శృతిహాసన్ ఇటీవల ‘పల్ప్ ఎక్స్ శృతి’ పేరుతో స్కిన్ కేర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సహజసిద్ధమైన సౌందర్య సాధనాలు ఇష్టపడే శృతికి లాక్డౌన్లో తీరిక
దొరికిందట. దీంతో స్కిన్ కేర్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నది. సొంతంగా అధ్యయనం చేసింది. అవి విజయవంతం కావడంతో సౌందర్య సంరక్షణ ఉత్పత్తులపై దృష్టిపెట్టింది. తక్షణం ‘Pulp X Shruti’ పేరుతో ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలో తన బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి మరిన్ని ఉత్పత్తులను పరిచయం చేసే ప్రయత్నంలో ఉంది శృతిహాసన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. తీరిక సమయాల్లో విభిన్న రకాల చర్మ స్వభావాలపై అధ్యయనం చేస్తున్నది. వివిధ చర్మ సమస్యలకు పరిష్కారం చూపాలనే తాను స్కిన్ కేర్ బిజినెస్లో అడుగుపెట్టినట్లు చెబుతున్నది శృతి.
సరిగ్గా ఏడాది క్రితం లిప్కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది పాన్ ఇండియా స్టార్ నయనతార. తన బ్రాండ్పేరు ‘The Lip Balm Company’. స్టార్హీరోలతో బిజీగా ఉంటూనే తనకంటూ ఓ సొంత బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నది నయన్. ‘ద లిప్ బామ్ కంపెనీ’ ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్తో కలిసి ఈ బ్రాండ్ను లాంచ్ చేసింది తను. ఇద్దరిదీ దశాబ్ద కాల పరిచయం. ‘స్కిన్కేర్ ఉత్పత్తుల విషయంలో నేను రాజీ పడను. అందుకే వినియోగదారుల కోసం బెస్ట్ ప్రొడక్ట్స్ అందిస్తున్నాం. మా కంపెనీ ఉత్పత్తులను చూసి గర్వపడుతున్నా’ అంటున్నది నయన్. కొవిడ్ కారణంగా కొంత ఆలస్యమైనా.. అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునే ఉత్పత్తులు విడుదల చేశామని చెబుతున్నారు నయన్, రేణిత రాజన్.
పురుషుల కోసం ప్రత్యేకమైన సౌందర్య సాధనాలను అందిస్తున్నారు హీరో రానా దగ్గుబాటి. ఆయన ఆలోచనకు రోపోసో సంస్థ ఊతమిచ్చింది. ఫలితంగా రోపోసోతో కలిసి ‘డిక్రాఫ్’ బ్రాండ్ పేరుతో పురుషుల కాస్మటిక్ ఉత్పత్తుల పరిశ్రమలోకి రానా అడుగుపెట్టారు. ఇదొక డీ2సీ బిజినెస్. షేవింగ్ క్రీమ్స్, చర్మ సౌందర్య సాధనాలు వంటివి ఈ బ్రాండ్లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖం, గడ్డం, చర్మ సంరక్షణ ఉత్పత్తులు, వాటికి తగిన వస్ర్తాలను ఈ బ్రాండ్ ద్వారా విక్రయిస్తున్నారు. ‘నాకు పురుషుల గ్రూమింగ్ గురించి బాగా తెలుసు. ఈ రంగంలో ప్రముఖ సంస్థతో కలిసి చేయాలని ఉండేది. రోపోసో పార్టనర్ కావడంతో నా కల నెరవేరింది. రోపోసో ద్వారానే నా ఉత్పత్తులను మార్కెట్ చేయగలుగుతున్నాను’ అంటూ తన మనసులోని మాట చెప్పారు రానా. ఇప్పటివరకూ ఇతర బ్రాండ్స్కు ప్రచారం కల్పిస్తున్న రానా.. తన బ్రాండ్కు కూడా తనే అంబాసిడర్గా ఉన్నారు.
ఒకప్పటి హీరోయిన్ రాశి హైదరాబాద్లోని శ్రీనగర్కాలనీలో ‘కలర్స్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట బ్యూటీ సెంటర్ నిర్వహిస్తున్నది. గాయని స్మిత జూబ్లీహిల్స్లో ‘బబుల్స్’ పేరుతో బ్యూటీ సెలూన్ అండ్ స్పా నడుపుతున్నది. నటి రాజ్యలక్ష్మి బంజారా హిల్స్లో ‘మిర్రర్’ పేరిట సెలూన్, స్పా సెంటర్ ప్రారంభించారు. ఇలా చెబుతూపోతే చాలామంది హీరోయిన్లు, హీరోలు సొంతంగా చర్మ, కేశాల సంరక్షణ బ్రాండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
“బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..”
సెలబ్రెటీలు తమ పిల్లలకు డిఫరెంట్గా పేర్లు ఎందుకు పెడుతున్నరు.. రీజనేంటి?”