తల్లి కాలు విరిగిందనే మనస్తాపంతో ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులంతా ఆస్పత్రికి వెళ్లగా.. ఇంట్లోనే ఉన్న అతను దిగులుతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని ఉస్మాన్పురా కాలనీలో నివాసం ఉండే మహ్మద్ ఇర్ఫాన్ సిద్దికి-అమీనా ఇర్ఫానా దంపతులు. వారికి అబ్దుల్ సలాం సిద్దికి, అబ్దుల్ సమద్ సిద్దికి (16) అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తల్లి అమీనా ఇర్ఫానాకు రెండు రోజుల క్రితం చిన్న ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో శనివారం మధ్యాహ్నం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో చిన్న కుమారుడు సమద్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో శనివారం అందరూ ఆస్పత్రికి వెళ్లగా.. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న సమద్ ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు సలాం ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్రూంలో ఫ్యాన్కు వేలాడుతున్న సమద్ కనిపించాడు. దీంతో కంగారుపడిపోయి అతను.. వెంటనే తండ్రికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. అనంతరం సమద్ను జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
కాగా, తల్లి కాలు విరగడంతో బాధపడిన చిన్న కొడుకు మానసిక వేధనతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఇర్ఫాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.