KTR | హైదరాబాద్ : ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి నార్త్ ఇండియాలో ఎదురు గాలులు వీస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారత ప్రజలు మోదీ నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు.
ప్రతి ఇంటికి నీళ్లు, బుల్లెట్ ట్రైన్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఇళ్లు అని చాలా హామిలిచ్చిన మోదీ ఏ ఒక్కటి కూడా నేరవేర్చకుండా దేశ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. రాష్ట్రంపై ఎన్నో సార్లు విషం చిమ్మారు. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కావాలనే అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. నిత్యావసర వస్తువులను రెట్టింపు కన్నా ఎక్కువ చేసిన పిరమైన ప్రధాని మోదీ అని కేటీఆర్ విమర్శించారు.
నరేంద్ర మోదీని ఇప్పుడు ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. తమిళనాడు నాడు సహా చాలా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోదీని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో గెలవనియొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారు. లోక్ సభ నియోజకవర్గాల్లోని చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాలతో సంబంధమే లేదు. మల్కాజిగిరితో సంబంధమే లేని సునీత మహేందర్ రెడ్డిని అక్కడ పోటీలో నిలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరిస్తున్నాడనే దానికి ఇదే ఉదాహరణ. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలి. ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పి కొట్టి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి మోసాల్ని చూశాక ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్కు 10-12 సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. అప్పుడు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించి ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని కేటీఆర్ తెలిపారు.