సూర్యాపేట, మే 8 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లుగా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందిస్తే, కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఓ సీజన్ పూర్తయినా ఇంకా రైతుబంధు ఇవ్వకుండా.. ఎన్నికల కమిషన్ పేరిట సీఎం రేవంత్రెడ్డి దొంగ నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ జనంలోకి రాగానే లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని రేవంత్రెడ్డి భావించి రైతుబంధు ఇస్తున్నట్టు ప్రకటన చేశారని, వెంటనే తానే పనిగట్టుకొని ఆగేలా చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో బుధవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుబంధు పంపిణీ విషయంలో ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తే తాము మద్దతిస్తామని గతంలోనే కేసీఆర్ చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇంకా యాసంగి సాయం అందక ముందే వానకాలం సీజన్ మొదలైందని తెలిపారు. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న వానకాలం సీజన్ కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాపై రేవంత్ ప్రమాణం చేస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ వ్యవహారం చూస్తే రైతుబంధుతోపాటు అనేక పథకాలు అమలు చేస్తారన్న నమ్మకం కనిపించడం లేదని చెప్పారు. రైతులకు ఇదే చివరి రైతు బంధులా కనిపిస్తున్నదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టు అవుతుందని అన్నారు.
రైతులకు పరిహారం చెల్లించాలి..
రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. ఐకేపీల్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే సంబంధిత కలెక్టర్లను ఆదేశించి నష్టపోయిన మామిడి, వరి రైతులను గుర్తించి ఎన్నికలు ముగిసిన వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.