తిరుమల : పేదలకు వైద్య సేవలు అందిస్తున్న టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ( Balaji Arogya Varaprasadini ) పథకానికి మాజీ స్పీకర్ డా. కోడెల కుటుంబం రూ.20 లక్షల విరాళం అందించారు. కోడెల శివప్రసాద్ ( Dr. Kodela Siva Prasada Rao) ఆశయాలకు అనుగుణంగా ఆయన మనవళ్లు కోడెల గౌతం రూ.10 లక్షలు, కోడెల జేయాదిత్య రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం తిరుమలలోని టీటీడీ ఈవో కార్యాలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు డా. కోడెల శివరాం కృష్ణ అందించారు. పేదలకు వైద్య సహాయం అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు విరాళం అందించిన కోడెల కుటుంబాన్ని ఈవో అభినందించారు. భక్తులు, దాతలు టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మరింతగా సహకరించాలని ఆయన కోరారు.