Harish Rao | సిద్దిపేట అర్బన్, మే 8: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంతా రివర్స్గేర్లో నడుస్తున్నదని, తద్వారా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. బుధవారం ఆయన సిద్దిపేటలో రియల్ఎస్టేట్ వ్యాపారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ రంగా ల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు అద్భుతంగా ఉన్న రియల్ఎస్టేట్ రంగం నేడు కుదేలైందని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్పై బురద జల్లి, ఆరు గ్యారెంటీలు ఎగబెట్టేందుకు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ దుష్ర్పచారం చేస్తున్నదని, దీంతో పెట్టుబడులు రాక రియల్ఎస్టేట్ రంగం కుదేలైందని వివరించారు.
కరోనా సమయంలో నూ కేసీఆర్ సమయానికి రైతుబంధు ఇచ్చారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా మార్పు? అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు గాడిదగుడ్డే ఇచ్చాయని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల పేరు మీద ఒక పార్టీ, మతం పేరిట మరో పార్టీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు రూ.వేల కోట్లు మాఫీ చేసి కర్షకులను విస్మరించిందని మండిపడ్డారు.
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలుచేశామని చెప్పుకుంటున్న రాహుల్గాంధీ, వాటిని అమలుచేసిన గ్రామాల్లోనే ఓట్లు అడగాలని సవాల్ చేశారు.టీవీ చూస్తే తిట్లు, దేవుడు మీద ఒట్లు.. ఈ రెండే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను రద్దుచేసే కుట్ర చేస్తున్నదని, తద్వారా మరిన్ని సమస్యలు ఉత్పన్నం కాక తప్పదని హెచ్చరించారు.
ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లా రద్దును అడ్డుకుంటానని చెప్పారు. సిద్దిపేట అంటే ఎక్కడికి పోయినా గౌరవం ఉండేలా చేశానని, ఆ గౌరవాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సిద్దిపేటకు వచ్చే నాయకులు మన మీద ప్రేమతో రావడం లేదని, మనలో ఉన్న ఐక్యతను దెబ్బతీసేందుకే వస్తున్నారని చెప్పారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ దుబ్బాకలో ఏమీ చేయకపోవడంతో అక్కడి ప్రజలు, అసెంబ్లీ ఎన్నికల్లో 54 వేల ఓట్లతో ఆయనను ఓడించారని పేర్కొన్నారు.
వెంకట్రామిరెడ్డి గెలుపు హరీశ్రావు గెలుపు అని, హరీశ్రావు గెలుపు కేసీఆర్ గెలుపు అని అన్నారు. సిద్దిపేటలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా తాను పాల్గొన్నానని, హిందూ ధర్మ పరిరక్షణలో తాను భాగమయ్యానని, భవిష్యత్తులోనూ ఉంటానని హామీ ఇచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పనిచేస్తానని, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు. ఫేక్ ప్రచారం చేయడంలో బీజేపీ అభ్యర్థి దిట్ట అని, రేపటినుంచి ఫేక్ ప్రచారం చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.