దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవా? పలు రాష్ర్టాల్లోనూ ప్రాంతీయ పార్టీలే కమలం పార్టీ దూకుడుకు కళ్లెం వేస్తున్నాయా? కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయినట్టేనా? తెలంగాణలోనూ బీజేపీని నిలువరించటం బీఆర్ఎస్తోనే సాధ్యమా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సందేహాలన్నీ అక్షర సత్యాలేనని ఓ రహస్య సర్వే స్పష్టం చేస్తున్నది.
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, కీలకంగా భావిస్తున్న ముస్లిం మైనార్టీ పెద్దలు.. బీజేపీని నిలువరించేందుకు పెద్దఎత్తున వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణతో సహా దేశవ్యాప్తంగానూ ఒక రహస్య సర్వే చేయించుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది.
బీజేపీని నిలువరించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎన్నికల్లో ఎటువైపు అడుగులు వేయాలి? అన్న ప్రధాన ఎజెండాతో చేపట్టిన ఈ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడైనట్టు భోగట్టా. సర్వే వివరాలన్నింటినీ క్రోడీకరించిన మైనార్టీ పెద్దలు ఇప్పటికే క్షేత్రస్థాయికి స్పష్టమైన సంకేతాలు పంపినట్టుగా సమాచారం. అనేక రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలే బలమైన రాజకీయ శక్తులుగా నిలబడి బీజేపీని నిలువరిస్తున్నా యని, కాంగ్రెస్తో లాభం లేదని సర్వేలో తేలినట్టు సమాచారం.
అందుకే జాతీయంగా గంపగుత్తగా ఒక నిర్ణయం తీసుకోవడం కంటే.. ఎక్కడికక్కడ ఆయా రాష్ర్టాల్లోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని మైనార్టీ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధిష్ఠానం ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణలో ఆ పార్టీని దెబ్బ కొట్టాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని సర్వేలో తేలటంతో లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకే అండగా నిలవాలని మైనార్టీ పెద్దలు సంకేతాలు ఇచ్చినట్టు చెప్తున్నారు.
ఐదు నెలల్లో హస్తం బలహీనం
అలవికాని హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఐదు నెలల్లోనే బలహీనపడినట్టు మైనార్టీ ప్రముఖులు చేసిన జాతీయ సర్వేలో తేలిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం, వ్యవసాయ సంక్షోభం, కరెంటు కోతలు తదితర సమస్యలతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు దేశవ్యాప్తంగా రాహుల్ ప్రభ కనిపించకపోవటంతో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయినట్టు సర్వే తేల్చింది.
12-13 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నదని, మిగిలిన 3-4 స్థానాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నట్టు సర్వేలో గుర్తించారు. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతిస్తే అది పరోక్షంగా బీజేపీకి వరంగా మారే ప్రమాదం ఉన్నదని మైనార్టీ పెద్దలు గ్రహించినట్టు తెలిసింది. అందుకే బీఆర్ఎస్కు మద్దతిచ్చి, ఆ పార్టీని గెలిపిస్తే.. బీజేపీని దెబ్బతీసినట్టు అవుతుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని క్షేత్రస్థాయికి సంకేతాలు పంపినట్టు తెలిసింది.
మరోసారి ఆ ట్రాప్లో పడొద్దు
బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని కొందరు నిజమేనని నమ్మినట్టు సర్వేలో ప్రస్తావించారు. ఈ పరిణామం తమకు అనుకూలమని భావించిన బీజేపీ కూడా.. ఆ ప్రచారాన్ని పెద్దగా తిప్పి కొట్టకుండా ఎన్నికల్లో లాభపడింది. తద్వారా ఏకంగా ఎనిమిది స్థానాలు (13.9 శాతం ఓట్లు) గెలుచుకుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మితే మరోసారి బీజేపీ నెత్తిన పాలుపోసినవారం అవుతామని సర్వేలో తేలినట్టు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మోదీ ప్రభుత్వం ఈడీతో అరెస్టు చేయించింది.
ఒకవేళ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేస్తారు? అని ఇందులో విశ్లేషించినట్టు తెలిసింది. మైనార్టీ పెద్దలు తెలంగాణ సహా అనేక రాష్ర్టాల్లో రాజకీయ పరిస్థితులను విశ్లేషించినట్టు సమాచారం. ఈ విశ్లేషణలో బీజేపీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతున్నదని గుర్తించారు. బీహార్లో తేజస్వీ యాదవ్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కేరళలో విజయన్, ఢిల్లీలో ఆప్, ఒడిశాలో పట్నాయక్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ.. ఇలా ప్రాంతీయ పార్టీలే బీజేపీని నిలువరిస్తున్నట్టు తేల్చారు.
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల కంటే దాదాపు 10-12 శాతం ఓట్లు బీజేపీకి కోల్పోనున్నదని, బీఆర్ఎస్ మాత్రం తన ఓటింగ్ శాతాన్ని నిలుపుకోనున్నదని తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో నిర్వహించిన ఒక సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ క్రమంలో సింహభాగం కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మళ్లితే.. గెలవని కాంగ్రెస్కు మైనార్టీలు ఓటేస్తే.. బీజేపీకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరే ముప్పు పొంచి ఉన్నదని విశ్లేషణలో తేల్చారు. ఈ లెక్కన బీఆర్ఎస్కు ఏకపక్షంగా మద్దతివ్వాలని మైనార్టీ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం.
మైనార్టీలకు కేసీఆర్ చాలా మేలుచేసిండు
ముస్లిం మైనార్టీ ప్రజల ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిండు. మైనార్టీ విద్యార్థుల కోసం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు, షాదీముబారక్, మైనార్టీ రుణాలు, మదర్సాలో పనిచేసే మౌజమ్లు, ఇమాంలకు జీతాలు వంటి అనేక పథకాలు తీసుకొచ్చిండు. మైనార్టీ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఎవ్వరూ చేయలేదు. అన్ని వర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్తోనే సాధ్యం. మైనార్టీలంతా లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటం.
– ఇమ్రాన్ఖాన్, మైనార్టీ యువ నాయకుడు, అక్బర్బాగ్, మలక్పేట