KTR | హైదరాబాద్ : కేంద్రంలో ఉన్న సవతి తల్లిపై పోరాడాల్సి ఉంది.. నాలుగు ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాదు. ఎందుకంటే వారు ఢిల్లీ గులామ్లు. ఇదే గులాబీ కండువా ఎగిరితే.. పార్లమెంట్లో మన గొంతు వినబడుతుంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలంటేకే కేసీఆర్ సైనికులు పార్లమెంట్లో ఉండాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ అల్వాల్లో ఏర్పాటు చేసిన యూత్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటే.. ఇన్వర్టర్, జనరేటర్, క్యాండిల్ లైట్, టార్చ్ లైట్, పవర్ బ్యాంక్, ఛార్జింగ్ బల్బ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉన్నంతకాలం కరెంట్ ఉండదు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే.. బీఆర్ఎస్కు ఎందుకు ఓటేయాలని అడుగుతున్నారు. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ సాధించుకోవాలంటే పార్లమెంట్లో మనం శాసించే పరిస్థితి ఉండాలన్నారు. 17 ఎంపీలను గెలిపించాలన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు కలిసి కేసీఆర్ పార్టీ తెలంగాణలో 17 సీట్లు గెలిచినా.. ఢిల్లీలో బిల్లు పాస్ కావాలంటే 272 మంది మద్దతు ఉండాలి కదా..? తెలంగాణ ఎలా తెస్తాడు అని హేళన చేశారు. కానీ 2004లో ఐదుగురు ఎంపీలు గెలిచారు. కేసీఆర్ ఢిల్లీకి పోయి 32 పార్టీలకు చెందిన 272 మంది ఎంపీలను ఒప్పించి 2014లో కేసీఆర్ తెలంగాణను సాధించారు అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు.. రాహుల్ గాంధీ, మోదీ చెప్పింది చేస్తారు. తెలంగాణ గురించి దమ్మున్న నాయకులే కొట్లాడుతారు. జూన్ 2వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నది. కేంద్ర పాలిత ప్రాంతం అయితే.. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది. ఒక్క చిన్న పని కూడా చేసుకునేందుకు అవకాశం ఉండదు. మోరీ, నాలా నిర్మించాలన్నా, రోడ్డు వేయాలన్నా ఢిల్లీకి పోయి అడగాలి. కేంద్ర పాలిత ప్రాంతం ప్రతిపాదనను అడ్డుకోవాలంటే గులాంబీ జెండా పార్లమెంట్లో ఎగరాలి. రాగిడి లక్ష్మారెడ్డి గెలవాలని కేటీఆర్ పేర్కొన్నారు.