KTR | హైదరాబాద్ : దమ్ముంటే హరీశ్రావు సవాల్కు రేవంత్ రెడ్డి స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు.
రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు.. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మోసం పార్ట్ -2 కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. ఆయన ఏ సవాల్కు కట్టుబడి ఉన్నాడో చెప్పాలె? అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ 10- 12 స్థానాలు సాధిస్తే కేంద్రంలో రానున్న ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉంటుందన్నారు కేటీఆర్. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేకుండా కూడా సుమారు 13 పార్టీలు బయట ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మాకు రాజకీయ ప్రత్యర్థులే. ఈ రెండు పార్టీలు చేసిన ద్రోహానికి దేశానికి ఎంతో నష్టం జరిగింది. అందుకే కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించి ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. కాంగ్రెస్కు బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదు… బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేకనే రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశం నుంచి కేరళకు పారిపోయిండు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఒత్తిడి చేసిన ఎదుర్కొని బీజేపీని తట్టుకుంటున్నది ప్రాంతీయ శక్తులే. ఒకనాడు ఎన్టీ రామారావు భారతదేశం అనే పార్టీ పెట్టాలనుకున్నాడు. కానీ ఆయన శిష్యుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాడు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా విస్తరించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రస్తుతానికి తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకోవటానికి కష్టపడుతున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.