హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) ప్రారంభమైంది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరుగనుంది. మే 11 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. నేడు, రేపు అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు, 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
తెలంగాణ, ఏపీలో కలిపి మొత్తం 3.5 లక్షల మందికిపైగా విద్యార్థులు అప్లయ్ చేసుకున్నారు. వారిలో 2.54 లక్షల మంది ఇంజినీరింగ్కి, లక్షా 200 మందికిపైగా ఇంజినీరింగ్ అండ్ ఫార్మా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది సుమారు 50వేల దరఖాస్తులు అదనంగా వచ్చాయి. మొత్తంగా ఇంజినీరింగ్ కోసం 1.5 లక్షల మంది బాలురు, లక్షా 3వేల మంది బాలికలు నమోదు చేసుకున్నారు. ఫార్మా కోసం 73 వేల మంది బాలికలు నమోదు చేసుకోగా, బాలురు 27 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 301 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. వాటిలో అగ్రికల్చర్, ఫార్మాకి 135, ఇంజినీరింగ్ స్ట్రీమ్ 166 చొప్పున కేంద్రాలను కేటాయించారు.