West Bengal | స్వాతంత్య్ర దినోత్సవ వేళ పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో జరిగిన దారుణ జంట హత్యలు కలకలం రేపింది. వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అనిసుర్ రెహమాన్(54), అతని కుమారుడు అబు సుఫియాన్23)లను నకాషిపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెతువాడహరి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి బాధితులు తమ కారులో ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కారును అడ్డగించి అందులో ఉన్నవారిపై కాల్పులు జరిపారు.పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో అనిసుర్ రెహమాన్, అతని కుమారుడు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు.
ఈ హత్యల వెనుక స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు జుబ్బర్ షేక్, అతని అనుచరులే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. జుబ్బర్ షేక్ ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ అతడి ఆదేశాల మేరకే తన అనుచరులతో పథకం ప్రకారం దాడి చేయించారని వారు తెలిపారు. నదియా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డెడ్బాడీస్ను పోస్ట్మార్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. హింస జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, అబు సుఫియాన్ కళ్యాణిలో ఎల్ఎల్బీ చదువుతున్నాడు.