కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీకి ‘పప్పూ’ బిరుదు ఊరకనే రాలేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి 2004లో ప్రవేశించిన తర్వాత, తన వ్యవహార సరళిని, సమర్థతను గమనించిన మీదట, 10 సంవత్సరాలు అయినా గడవకముందే ఆయనకు ఈ బిరుదు లభించింది.ఆ మాట మొదట ఎవరు అన్నారో గాని, త్వరలోనే కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ వర్గాలలో, మీడియాలో, బయటి సమాజంలో కూడా ఈ మాట వేగంగా ప్రచారమై ఆమోదం కూడా పొందింది. తర్వాత మరొక పదేండ్లు గడిచినా ఆయన ఆ బిరుదును ఇప్పటికీ పోగొట్టుకోలేకపోయారు. ఈ లక్షణాల వల్లనే ఒక దశలో కాంగ్రెస్ వర్గాలు పార్టీ నాయకత్వం నుంచి రాహుల్ను తప్పించి ప్రియాంకకు అప్పగించాలనే అసాధారణమైన ఆలోచనలు చేశాయి.
Rahul Gandhi | రాహుల్ ఈ నెల 5న నిర్మల్ సభలో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు మహిళలకు నెలకు రూ.2,500 సహాయం ఇవ్వటం మొదలైపోయిందని, ఆ సొమ్ము వారి బ్యాంకు ఖాతాలలో జమ కూడా అవుతున్నదని ప్రకటించటాన్ని, అదేవిధంగా ప్రజలకిచ్చిన ఆరు గ్యా రెంటీలు సైతం అమలవుతున్నాయని చెప్పటాన్ని చూసినప్పుడు, తనకు ‘పప్పూ’ బిరుదు ఊరకనే రాలేదని అర్థమవుతున్నది.
ఇందులో గమనించవలసిన విషయాలు రెండున్నాయి. ఒకటి, రాహుల్గాంధీ నిర్మల్ సభలో ప్రసంగించటానికి ముందు, హామీల అమలు పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఎటువంటి బ్రీఫింగ్ ఇచ్చిందనేది. రెండు, తాము పాలించే రాష్ర్టాలలో హామీల అమలుగురించి, పరిపాలన తీరు గురించి ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం ఎటువంటి మానిటరింగ్ చేస్తున్నదనేది? ఆ ప్రకారం రాహుల్ తదితర నాయకులకు ఏమి సమాచారం ఇస్తున్నదనేది. మంచిర్యాలలో రాహుల్ ప్రసంగాన్ని చూసినప్పుడు, ఈ రెండు విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు కేంద్ర కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం మాట చూద్దాము. ఇవి సాధారణమైన రోజులు కావు. ఎన్నికల ప్రచారపు వేడి ఎండవేడితో పోటీ పడి పెరుగుతున్నది. ఏ పార్టీ, ఏ నాయకుడు ఏ చిన్న మాట అన్నా తక్కిన వారితో పాటు ప్రజలు సైతం వెంటనే గమనించి వ్యాఖ్యానిస్తున్నారు. అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇది ఒకటి కాగా, కాంగ్రెస్ హామీల విషయమై ప్రతిరోజూ హోరాహోరీ యుద్ధమే సాగుతున్నది. అటువంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలనేది రెండవది. యుద్ధాలను వేర్వేరు పార్టీల ప్రత్యర్థులు స్థానికంగా సాగించటం వేరు. కాని, రాహుల్ వంటి జాతీయ నాయకుడు ఆ యుద్ధంలో పాల్గొనటం వల్ల విషయం మరొకస్థాయికి చేరుతుంది. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోలేని విషయమా? అయినప్పటికీ రాహుల్కు ఇటువంటి శుద్ధ అబద్ధపు బ్రీఫింగ్ ఎందుకిచ్చినట్టు? అందువల్ల ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు, అవహేళనలను రాజకీయమంటూ కొట్టి వేస్తారేమో తెలియదు. కాని యథాతథంగా ఆ మాటలు శుద్ధ అబద్ధాలు కావటం, అది సాధారణ ప్రజలకు కూడా అర్థం కావటం గురించి ఏమంటారు? హామీలు అమలు కాకపోవటంపై ఇప్పటికే నిరసనగా ఉన్న స్త్రీలు, రైతులు, ఇతర వర్గాలకు రాహుల్ మాటలు పుండుపై కారం చల్లినట్టుగా మారాయి. మరొకవైపు ఈ ఉదంతం ప్రతిపక్షాలకు సహజంగానే కలిసివచ్చింది.
రాహుల్ ప్రసంగం తర్వాత అదేరోజున కేసీఆర్ తదితరులు వేర్వేరు చోట్ల తమ సభలలో, మహిళల ఖాతాల్లో రూ.2500 పడటం నిజమా అని సూటిగా ప్రశ్నించారు. మహిళలు లేదు లేదంటూ హోరెత్తారు. మరి రాహుల్తో అబద్ధం చెప్పించి ఏమి సాధించినట్లు? దీనితో, తక్కిన హామీల విషయమై ప్రజలకు ఇప్పటికే మొదలైన అనుమానాలు మరింత పెరిగే ప్రమాదం లేదా?
ఇప్పుడు కేంద్ర నాయకత్వం, కేంద్ర కాంగ్రెస్ విషయం పరిశీలిద్దాం. ఆ పార్టీ పలు గ్యారెంటీలు ప్రజలకిచ్చి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లలో అధికారానికి వచ్చింది. గ్యారెంటీలు స్వయంగా కేంద్ర నాయకత్వం ప్రమేయంతో తయారయ్యాయి. ఆ గ్యారెంటీ పత్రాలను సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకా గాంధీలు ఆయా రాష్ర్టాల ప్రజల సమక్షంలో విడుదల చేశారు. గ్యారెంటీల అమలు స్వయంగా తమ బాధ్యత అని ప్రకటించారు. ఆ మేరకు సోనియా గాంధీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అటువంటి స్థితిలో చేయవలసిందేమిటి? అసలే తమ పార్టీ కేవలం మూడు రాష్ర్టాలలో అధికారంలో ఉంది. లోక్సభలో వరుసగా రెండవసారి కూడా ప్రతిపక్ష హోదా అయినా లభించలేదు. ప్రస్తుతం తిరిగి లోక్సభ ఎన్నికల సంగ్రామం భీకరంగా నడుస్తున్నది. అటువంటప్పుడు తాము అధికారంలో ఉన్న రాష్ర్టాలలో ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా పొందాలి. అది జరగాలంటే హామీల గ్యారెంటీలు అమలుకావాలి. అమలయ్యేట్టు ఢిల్లీ నుంచి పర్యవేక్షణ జరగాలి. పైగా వాటి అమలు తమ బాధ్యత అంటూ గాంధీ కుటుంబం స్వయంగా ప్రకటించింది. కనుక పర్యవేక్షణ తప్పనిసరి. అందుకోసం చేయవలసిందేమిటి? మూడు రాష్ర్టాల పర్యవేక్షణ కోసం ఏఐసీసీలో మూడు డెస్క్లతో ఒక యంత్రాంగం ఏర్పాటుచేయాలి. ఆ యంత్రాంగం నుంచి గాంధీ కుటుంబానికి ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్లాలి. వాటిలో ప్రజాభిప్రాయాన్ని కూడా చేర్చాలి. వారు వాటిని పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, దిద్దుబాటు హెచ్చరికలు చేయాలి. కాని, పార్టీలో ఏ బాధ్యత లేకున్నా, సాంకేతికంగా ఒక అధ్యక్షుడంటూ ఉన్నా ఆయనను నామమాత్రుడిని చేసి అన్నీ తానై వ్యవహరిస్తున్న మకుటం లేని మహారాజు ఇటువంటి యంత్రాంగమేదీ సృష్టించలేదు. ఆ పని చేసి ఉంటే, హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వపు అబద్ధాలను గుడ్డిగా చదివి నవ్వులపాలయ్యే స్థితి ఏర్పడేది కాదు.
రాహుల్గాంధీ ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. దేశ విదేశాల్లోని ఉన్నత విద్యా సంస్థలలో చదివినవాడు. వారసత్వ పరిజ్ఞానం, అనుభవం ఎంతో కలవాడు. పార్టీలో అనేక పదవులు నిర్వహించినవాడు. నాలుగుసార్లు లోక్సభకు ఎన్నికైనవాడు. పార్టీలో తన మాటే వేదవాక్కు. ఆ విధంగా 54 ఏండ్ల వయస్సు కూడా వచ్చినవాడు. కాని, ఇటువంటి పర్యవేక్షణగాని, అందుకొక యంత్రాంగం అవసరమని గాని ఆయనకు తట్టలేదు. ఆయనకు ఏదో ఒకవిధంగా అధికారం సంపాదించాలనే బలమైన కోరిక తప్ప, ప్రజలకు ఇస్తున్న హామీలు అమలుకు సాధ్యమైనవా కాదా అని జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఆలోచించాలనే ఇంగితం లేకపోయింది. ఒకసారి ఆ వలయంలో చిక్కుకున్న నాయకునికి, పర్యవేక్షణలు అవసరమని గాని, అందుకు యంత్రాంగం ఏర్పాటుచేయాలని గాని స్ఫురించకపోవటంలో అసహజం, ఆశ్చర్యం ఏమీ లేవు.
ఈ రెండు విధాలైన పరిస్థితుల నుంచి, వైఫల్యాల నుంచి వచ్చిందే రాహుల్గాంధీ నిర్మల్ ప్రసంగం. ఇటువంటి ప్రసంగాల వల్ల కాంగ్రెస్ విజయావకాశాలపై ప్రభావం ఉంటుందా లేదా అన్నది కాదు ప్రశ్న. కాని పార్టీ పట్ల, రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాహుల్ గాంధీ పట్ల, గాంధీ కుటుంబం పట్ల విశ్వసనీయతపై ఎటువంటి ప్రభావం ఉంటుందనేది ఆలోచించవలసిన విషయం. అదేవిధంగా, రాహుల్ను ‘పప్పూ’ అని ఆప్యాయంగా పిలిచేవారు ఈ విషయం గురించి చెప్పుకొని మరొకమారు నవ్వకుండా ఉండగలరా అన్నది కూడా ఆలోచించవలసిందే.
ఇటువంటి రాహుల్ ఈ దేశానికి ప్రధానమంత్రి కాగోరుతున్నారు. లోపాలెన్ని ఉన్నా ఆయన బీజేపీపై పోరాడుతున్నారనేది నిజమే. ఆ పోరాటంలో నిజాయితీ లేకపోవటం కూడా అంతే నిజం. ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ మొదలుకొని నేటివరకు ఒకవైపు సెక్యులరిజం, మరొకవైపు సాఫ్ట్ హిందూత్వ అనే రెండు చక్రాలపై నడుస్తున్న బండి. దీనిని వ్యూహాత్మకంగా సెక్యులరిజం, ఎత్తుగడల రీత్యా కమ్యూనలిజం అనవచ్చు. కాంగ్రెస్ క్రమంగా క్షీణించటానికి ఈ ద్వంద్వనీతి ఒక ముఖ్యమైన కారణం. అదేవిధంగా, ఒకవైపు సంక్షేమాలు, సాధికారతలు, బడుగు బలహీన వర్గాలు అంటూ, మరోవైపు ధనిక వర్గాల అనుకూలత, విచక్షణారహితంగా ఆర్థిక సంస్కరణల అమలు, పేదలకు, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలు చేయటం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి మరొక కీలకమైన తార్కాణం. రాహుల్గాంధీ ఈ 20 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఇటువంటి సీరియస్ విషయాలు, విధానాల గురించి ఎప్పుడూ చర్చించలేదు. వాటిగురించి ఆయనకు తెలుసునా అనేది కూడా అనుమానమే. తనకు కావలసింది అధికారం మాత్రమే. అందుకోసం అలవికాని హామీలిచ్చి, అవి అమలు కాకున్నా అయినట్లు అబద్ధాలు మాట్లాడటం మాత్రమే. ఆ విధంగా చూసినప్పుడు మాత్రం ఆయనను ‘పప్పూ’ అనలేము.
-టంకశాల అశోక్