Rythu Runa Mafi | కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ఆ పార్టీని ఇరకాటంలో పెట్టేది, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై అత్యంత భారమయ్యేది రైతు రుణమాఫీయే. ఆ పార్టీ చెప్పినట్టు ఏకమొత్తంగా రూ.2 లక్షల మేరకు బ్యాంకుల్లో ఉన్న రైతుల పంట అప్పును చెల్లించాలంటే సుమారుగా రూ.37 వేల కోట్లు అవసరం. అయితే మొత్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం 2024-25 బడ్జెట్లో కేటాయించిన సొమ్ము రూ.53,196 కోట్లు మాత్రమే. ఈ లెక్కన ఒకేసారి రూ.2 లక్షలు మాఫీ చేస్తే మిగిలిన సొమ్ముతో మిగతా హామీలు ఏడాది పాటు నడిపించడం అసాధ్యం.
ఆగస్టు 15 లోగా రైతు రుణమాఫీ చేసితీరుతామని సీఎం రేవంత్ ఒట్టు మీద ఒట్టు పెట్టుకుంటున్నారు. అంతదాకా రైతులపై ఒత్తిడి తేవద్దని జాతీయ బ్యాంకులను కోరుతూ, వసూళ్లకు వెళ్లవద్దని సహకార బ్యాంకులను ఆదేశించారు. రైతులకు అందే వ్యవసాయ రుణాల్లో 85 శాతం జాతీయ బ్యాంకులే ఇస్తుంటాయి. ఈ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అవి పట్టించుకోవు. రుణాల చెల్లింపు, బకాయి అప్పుల వసూళ్ల విషయంలో పై ఆదేశాల మేరకు ఆ సిబ్బంది వ్యవహరించక తప్పదు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల ప్రకటన కన్నా ఏడాది ముందు వరంగల్ డిక్లరేషన్ సభలోనే రేవంత్ రెడ్డి ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల అప్పు మాఫీ చేస్తుందని’ గొంతెత్తి ప్రకటించారు. అది ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. నిజానికి రాష్ట్రంలో రూ.లక్ష కన్నా మించి రుణం తీసుకున్న రైతులు వేలల్లోనే ఉంటారు. కానీ, ఒకేసారి లక్ష పెంపు మాత్రం వినడానికి ఇంపుగా ఉంది. మాఫీ సొమ్ము పెంచడం వల్ల పెద్ద రైతులు ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 1990లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రుణమాఫీ చేసేటప్పుడు ఒక్కో రైతు ఖాతాలో రూ.10 వేలు మాత్రమే జమ చేసింది. మరోసారి 2008లో ఆ లబ్ధిని 5 ఎకరాలు, ఆ లోపు భూమి గల రైతులకే పరిమితం చేసింది. ఈ లెక్కన లక్షను మించిన రుణమాఫీ రాష్ట్ర ఖజానాపై అనవసర భారమే కాకుండా ఇతర ప్రయోజనాలపై దెబ్బ పడుతుంది.
2023 చివరలో దేశంలో జరిగిన నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో రైతు రుణమాఫీ పరిధిని పెంచిన పార్టీలే గెలిచాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో బీజేపీ రైతు రుణ మాఫీ మొత్తాన్ని పెంచి గెలుపును కైవసం చేసుకుంది. నిజానికి రైతులందరికి సాగు భూమి ప్రకారం ఆర్థిక సహాయం అందడానికి రైతుబంధు పథకమే కరెక్టు. బ్యాంకు ప్రమేయం లేకుండా ప్రభుత్వానికి, రైతుకు మధ్యన జరిగే సాయం సజావుగా సాగుతుంది. కేవలం బ్యాంకు రుణం తీసుకున్నవాళ్లకే మేలు కలిగే రుణమాఫీ వల్ల రైతులందరికీ మేలు జరగదు. నిజానికి 2018 లోనే కాంగ్రెస్ లక్ష రూపాయల రుణమాఫీ అనే ఆశ రైతుల్లో కల్పించి ఆ పార్టీ గెలువకపోగా గెలిచిన పార్టీపై ఆర్థికభారాన్ని మోపింది. పాలక పార్టీని చిక్కుల్లో పెట్టేందుకు లక్ష సరిపోదన్నట్టు ఈసారి రూ.2 లక్షల హామీని ప్రకటించింది. రైతుబంధుతో పాటు రూ.లక్ష రుణమాఫీ రాష్ట్ర ఖజానాపై ఎంత భారమో తెలిసి కూడా అటు రైతుబంధు మొత్తాన్ని, ఇటు రుణమాఫీ పరిధిని పెంచి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలపై ఊహించని మోతకోలును మోపింది.
ఆగస్టు 15 ఇప్పుడు కాంగ్రెస్ గుండెల్లో భయాన్ని పుట్టించే తేదీగా మారింది. మాజీ మంత్రి హరీశ్రావు చాలెంజ్ను స్వీకరించిన రేవంత్రెడ్డికి తన మాట నిలుపుకోవడం అంత ఈజీ కాదు. రుణమాఫీ కోసం ఓ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి రాష్ర్టానికి నెల నెలా వచ్చే ఆదాయంలో 10 శాతం దానికి మళ్లించి బ్యాంకులకు రూ.37 వేల కోట్లను ఈఎంఐ మాదిరిగా చెల్లించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది. చూడటానికి ఇది తేలికగా కనబడ్డా కార్యాచరణలో అడ్డంకులెన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ బ్యాంకులు రాష్ర్టాల మాట వినవు. ఇలాంటి నిర్ణయాలన్నీ ఆర్బీఐ స్థాయిలో జరుగుతాయి. ఆర్బీఐ కేంద్రం ఆదేశాల ప్రకారం పనిచేస్తుంది. కేంద్రం మద్దతు లేకుండా బ్యాంకుల నుంచి ఎలాంటి సదుపాయం పొందలేరు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కోరినట్లు బ్యాంకు రుణాలన్నీ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్కు బదలాయింపు కావాలన్నా కేంద్రం ఒప్పుకోవలసిందే. అంటే, రూ.37 వేల కోట్ల రుణం రాష్ర్టానికి మంజూరు చేసి నెలసరి వాయిదాల్లో వసూలు చేసుకోవాలి. ఆ రుణానికి సరిపడా ష్యూరిటీ అవసరం.
ముందుగా అందుకు అన్ని బ్యాంకులు అంగీకరించాలి. సరిపడా నిధులు వాటి దగ్గర ఉండాలి. ఇలా ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం దయపై ఆధారపడి ఉంటుంది. 2014లో రెండు తెలుగు రాష్ర్టాలు రుణమాఫీ విషయంలో రైతుల అప్పులను రీ షెడ్యూల్ చేయమని ఆర్బీఐని కోరాయి. కొన్ని కరువు ప్రాంతాల అప్పులను మాత్రమే అది రీ షెడ్యూల్కు ఒప్పుకున్నది. దానివల్ల రాష్ర్టాలకు భారమేమి తగ్గలేదు. కేంద్రం పూర్తిగా సహకరిస్తేనే బ్యాంకుల ద్వారా ఏదైనా సాధ్యపడుతుంది. అది కాలు అడ్డం పెడితే రాష్ర్టాల స్థాయిలో వేల కోట్ల రుణాలు ఏకమొత్తంగా మాఫీ చేయడం గగనమే. ఈ చిక్కులు తెలిసే కేసీఆర్ రైతుబంధు పథకం ఆరంభించారు. దానికితోడు రుణమాఫీ ఇయ్యాల్నంటే మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడమే.
ఎన్నికల ముందు రైతు రుణమాఫీ హామీల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దెబ్బతింటున్నది. పాలించే ఐదేండ్లలో ఒకేసారి చేసే బ్యాంకు రుణమాఫీ తర్వాత రైతు బ్యాంకు రుణాన్ని చెల్లించేందుకు మరో ఎన్నికల కోసం, మరో మోసకారి హామీ కోసం ఎదురుచూస్తాడు. అంతవరకు బ్యాంకుల్లో వసూళ్లు నిలిచిపోయి వాటి వ్యాపారం కుంటుపడుతుంది. పంట రుణాలంటే ఐదేండ్లలో ఒకసారి తీసుకొంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రభుత్వం తీర్చే అప్పుగా మారిపోయింది. బ్యాంకులో సంతకం పెట్టి అప్పు తీసుకున్న రైతు ఆ సొమ్ము తాను కట్టాలన్న ధ్యాసే కోల్పోయాడు. ఎలాగోలా గెలవాలనుకోవడం ఏ రాష్ర్టానికి శ్రేయస్కరం కాదు. రాష్ట్ర ఆర్థిక స్థోమతను అంచనా వేయలేని వారు ప్రజల మేలుకోరే వారు కాదు. లక్షయినా, రెండు లక్షలైనా రాష్ట్ర ఆదాయ వనరుల్లోంచే ఇవ్వాలి లేదా ప్రజలపై పన్ను భారం మోపాలి. ఒక వ్యక్తి తన పదవీ కాంక్ష తీర్చుకోవడానికి రాష్ర్టాన్ని బలి చేయడం ఎంతవరకు సబబో జనం ఆలోచించే సమయం ఇదే.
-బి.నర్సన్
94401 28169