New Districts | సూర్యాపేట, మే 6 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఉండేనా.. ఊడేనా? అని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునర్విభజన చేసి జిల్లాల సంఖ్యను కుదిస్తామని ప్రకటించడం, రాష్ట్రంలో తగ్గించే జిల్లాల జాబితాలో సూర్యాపేట కూడా ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. సూర్యాపేట జిల్లా కావాలనే ప్రజల చిరకాల కోరికను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ద్వారా మాజీ సీఎం కేసీఆర్ నెరవేర్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందోనని జనం భయపడుతున్నారు. ఐదు నెలల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చరు కానీ ఉన్న వాటిని పోగొడుతారా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సుమారు ఎనిమిదేండ్ల క్రితం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను బట్టి అభివృద్ధి, అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. అందులో భాగంగా ప్రజలకు పాలన చేరువయ్యేందుకు జిల్లాల పునర్విభజన చేపట్టింది. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలతో సూర్యాపేట జిల్లా ఏర్పాటైన విషయం విదితమే. గత పూర్వ నల్లగొండ జిల్లాకు వెళ్లేందుకు తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలోని 60 నుంచి 70శాతం గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడేవారు. హుజూర్నగర్, కోదాడతోపాటు తుంగతుర్తి నియోజకవర్గాల ప్రజలు నల్లగొండకు వెళ్లేందుకు 80 నుంచి 140కిలోమీటర్ల దూరం ప్రయాణించి వ్యయప్రయాసాలకు లోనయ్యేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఏర్పడడంతో ఆ మూడు నియోజకవర్గాల ప్రజలకు 40 నుంచి 80 కిలోమీటర్లు, సూర్యాపేటకు 60 కిలోమీటర్ల దూరం తగ్గింది. ఎనిమిదేండ్లుగా ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సేవలను ప్రజలు పొందుతున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాను తొలగిస్తే అనేక నష్టాలు జరిగే ప్రమాదం ఉంటుంది. సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం వల్లనే మెడికల్ కళాశాల రాగా, జిల్లాను తొలగిస్తే కళాశాల, జనరల్ ఆస్పత్రి స్థాయి తగ్గిపోతుంది. అలాగే సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అలంకారప్రాయంగా మారనున్నాయి. జిల్లా ఉంటే ఎప్పటికైనా నవోదయ పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలతోపాటు అనేక రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలు రానున్నాయి. జిల్లా లేకుంటే ప్రజలకు పాత కష్టాలు మళ్లీ మొదలవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి జిల్లాల సంఖ్యను కుదిస్తామని స్వయానా సీఎం రేవంత్ ప్రకటించడం, సూర్యాపేట జిల్లా కూడా పోతుందని సోషల్ మీడియాల్లో వార్తలు తిరుగుతుండడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయకుండా, గోదావరి జలాలు ఎత్తిపోయకుండా స్వయం ప్రకటిత కరువు తెచ్చి ప్రజలు, రైతులను నానా ఇబ్బందులకు గురి చేసింది. మరో పక్క జిల్లాలను కుదిస్తామనే ప్రకటనలతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాల్సిందేననే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తున్నది.
గతంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మా ఊరి నుంచి 90కిలో మీటర్ల దూరం ఉండేది. ఏదైనా పనులకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేది. సూర్యాపేట జిల్లా ఏర్పాటు చేయడంతో మాకు బాధలు తప్పాయి. సూర్యాపేటకు 20 కిలోమీటర్లే.. ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వస్తే సమస్య లేకుండా పని చూసుకొని వెళ్తున్నాం. సూర్యాపేట జిల్లాను తీసివేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇలాంటి పనులు చేయడం సరికాదు.
– బాణోతు దేవ్లా, పెద్దరాజుతండా, మోతె