Congress | యాదాద్రి భువనగిరి, మే 6 (నమస్తే తెలంగాణ) : భువనగిరి కాంగ్రెస్లో రోజురోజుకు సీన్ రివర్సవుతున్నది. అటు బీఆర్ఎస్ పుంజుకుంటుండగా ఇటు కాంగ్రెస్ డీలా పడిపోతున్నది. ముఖ్యంగా ఎస్సీ ఓటర్లు దూరమవుతున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి తిరుగుబాటుతో వేగంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీసీలకు టికెట్ ఇవ్వలేదని హస్తం పార్టీపై బీసీల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. దీనికి తోడు కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి రెడ్డి రాజకీయాలకు తెరలేపారు. రెడ్లంతా ఏకం కావాలని అంతర్గతంగా మంతనాలు జరుపుతున్నారు. ఏకంగా బీజేపీలోని రెడ్లతో టచ్లోకి వెళ్లడంతోపాటు ప్యాకేజీలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దాంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 80లక్షల మంది ఉన్న మాదిగలను పరిగణలోకి తీసుకోపోవడంపై బహిరంగంగానే కాంగ్రెస్ తీరును తూర్పారబడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టి.. నిరసన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా ప్రెస్మీట్లు ఏర్పాటు చేసి.. రేవంత్ రెడ్డి మాదిగలను తొక్కేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలోనే మాదిగలకు గుర్తింపు ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా కొనసాగుతుండగానే కాంగ్రెస్లో కొత్త పంచాయితీ షురూ అవుతున్నది. స్థానికంగా ఉన్న తమని కాదని, చామల కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోని రెడ్లను సంప్రదిస్తుండటపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదేండ్ల నుంచి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినా పట్టించుకోకుండా, పక్క పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇవ్వడం ఏంటనే లొల్లి నడుస్తున్నది.
మోత్కుపల్లి నర్సింహులు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది. ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కీలకమైన వ్యక్తి. ఆలేరు, తుంగతుర్తి నుంచి గెలిచారు. తుంగతుర్తి, నకిరేకల్ ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో మోత్కుపల్లి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. ఎస్సీ సామాజిక వర్గాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పటికీ ఆయన నోటి మాటతో కట్టుబడి పనిచేసే నాయకులు ఉన్నారు. ప్రస్తుతం నర్సింహులు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ముందుకు వెళ్తుండటంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపుతో ఇప్పటికే 50శాతానికి పైగా ఎస్సీలు కాంగ్రెస్కు దూరమయ్యారు.
ఓ వైపు బీఆర్ఎస్ పుంజుకోవడం, మరో వైపు జనంలో కాంగ్రెస్కు వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఏం చేయాలో పాలుపోని స్థితిలో నెలకొంది. ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో చామల.. రెడ్డి క్యాస్ట్ రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు. రెడ్లు రెడ్లు ఒకటంటూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా అంతర్గతంగా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. ఇక బీజేపీలోని రెడ్లతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని సమాచారం. ఆయా లీడర్లకు ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ తీరుపై బీసీల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అనే భావనకు వచ్చారు. అధికారంలోకి వచ్చాక రెడ్లకు మాత్రమే ప్రా ధాన్యం ఇస్తున్నారనే అపవాదుకు ఆజ్యం పోస్తున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్, బీజేపీ బీసీ అభ్యర్థులను బరిలోకి దింపింది. కానీ హస్తం పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా రెడ్డిని పోటీలో నిలిపింది. ఇక్కడి నుంచే బీసీల్లో కాంగ్రెస్పై అసహనం పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా మళ్లీ రెడ్డి ఫీలింగ్ తీసుకురావడంతో బీసీల్లో అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది.