హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలుపై తేదీని ప్రకటించే దమ్ము సీఎం రేవంత్రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలకు ముందు మైనార్టీ డిక్లరేషన్ పేరుతో 13 హామీలను ఇచ్చారని, వాటిలో ఒక్క దాన్నీ ఇంత వరకు అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కొండంత.. అమలు గోరంత అని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని మండిపడ్డారు. రేవంత్ మంత్రివర్గంలో మైనార్టీ వర్గానికి చెందినవ్యక్తి ఒక్కరూ లేరని తెలిపారు.
జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఇంతవరకు వాటి ఊసే ఎత్తలేదని విమర్శించారు. మైనార్టీల బడ్జెట్ను రూ.4వేల కోట్లకు పెంచుతామని, చెప్పి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్వి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప, ఏనాడూ ముస్లింలపై చిత్తశుద్ధి చూపలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ముస్లిం కుటుంబమైనా బాగుపడిందా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మైనార్టీలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు అండగా నిలవాలని విన్నవించారు.