హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఎప్సెట్ పరీక్షలో కేవలం 20శాతం మాత్రమే క్లిష్టప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నామని, మరో 40శాతం సులభంగా, ఇంకో 40శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్కుమార్రెడ్డి భరోసానిచ్చారు. ప్రశ్నలు కఠినంగా ఉంటాయేమోనన్న టెన్షన్ విద్యార్థులకు అక్కర్లేదన్నారు. ఈ నెల 7నుంచి 11వరకు ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఎప్సెట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
‘నమస్తే తెలంగాణ’తో వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు. ఇంటర్బోర్డు సహా 15బోర్డులకు చెందిన విద్యార్థులు ఎప్సెట్కు దరఖాస్తు చేశారని వెల్లడించారు. తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొనే ఎప్సెట్లో ప్రశ్నలిస్తాం అన్నారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే..
90నిమిషాల ముందే అనుమతి
విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి. 90నిమిషాల ముందు నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించం. చివరి నిమిషంలో పరీక్షాకేంద్రంలోకి వచ్చే విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయినట్టే. వెరిఫికేషన్, బయోమెట్రిక్, కంప్యూటర్ అలాట్మెంట్కు కనీసం 20 నిమిషాలు పడుతుంది. దీంతో చివరి నిమిషంలో వచ్చేవారు ఈ సమయాన్ని నష్టపోయినట్టే. ఇలాంటి వారికి ఎలాంటి అదనపు సమయాన్ని ఇవ్వం. విద్యార్థులు సాధ్యమైనంత ముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలి.
ఇంజినీరింగ్కు 166, అగ్రికల్చర్కు 135
ఈ ఏడాది ఎప్సెట్కు 35 వేలమంది అదనంగా దరఖాస్తు చేశారు. పెరిగిన దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని 20 పరీక్షాకేంద్రాలను పెంచాం. ఇంజినీరింగ్కు 166, అగ్రికల్చర్ ఫార్మసీకి 135 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశాం. తెలుగు, ఉర్దూల్లో ఏవైనా పొరపాట్లుంటే ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలనే ప్రామాణికంగా తీసుకొంటాం. విద్యార్థులు ఇంగ్లిష్ ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు చదివి సమాధానం ఇవ్వాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాం. 74169 23578, 74169 08215 నంబర్లను సంప్రదించవచ్చు.