వికారాబాద్, మే 4 : గ్యారెంటీలంటూ గారడీ మాటలతో గద్దెనెక్కిన హస్తం పార్టీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని.. త్వరలోనే ఆ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ మండలంలోని పులుసుమామిడిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.
గ్రామ శివారులో పనిచేస్తున్న ఉపాధిహామీ కూలీలను కలిసి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచేందుకు తొలి కేబినెట్ సమావేశంలోనే హామీలన్నీ అమలు చేస్తామన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమాన్ని విస్మరిం చిందని మండిపడ్డారు. అసలు ఆ హామీల అమలుకు ఎంత డబ్బు కావాలి.. ఎలా సమీకరించాలి అనే విషయాలపై కాంగ్రెస్ సర్కార్కు కనీసం స్పష్టత కూడా లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
రైతులు, ప్రజల పక్షాన ఉండే కాసాని జ్ఞానేశ్వర్ను ఆశీర్వదించాలన్నా రు. కారు గుర్తుకు ఓటేసి కాసానిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు గయాజ్, వైస్ ప్రెసిడెంట్ శివకుమార్, నాయకులు సత్తయ్య, నాయకులు అశోక్, సోషల్ మీడియా అధ్యక్షులు అనిల్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.